చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి: ఆదిమూలపు సురేష్‌

9 Jul, 2020 19:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘సీఎం జగన్ నిర్ణయానికి దళిత జాతి శిరస్సు వంచి నమస్కరిస్తోంది. దళితుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్లారు. అంబేడ్కర్‌‌ విగ్రహన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందేలా ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటులో టీడీపీ నానాయాగి చేస్తుంది. ఊరు చివర అంబేడ్కర్‌‌ విగ్రహం ఉండాలని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు దళితులను అనేక సార్లు అవమానించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు మాట్లాడారు. మీకెందుకురా రాజకీయాలు అంటూ దళితులను చింతమనేని హేళన చేశారు’ అని గుర్తు చేశారు. (అంబేడ్కర్‌కు సముచిత గౌరవం)

ఆయన మాట్లాడుతూ.. ‘125 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్‌‌ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయనకు ఘనంగా నివాళ్ళు అర్పించినట్లు అవుతుంది. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌‌ విగ్రహం ఏర్పాటు చేయడం చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలి. కాల్ మనీ, సెక్స్ రాకెట్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అంబేడ్కర్‌‌ విగ్రహం ఏర్పాటు అంటూ గతంలో చంద్రబాబు ప్రకటన చేశారు. నాలుగేళ్లుగా అంబేడ్కర్‌‌ విగ్రహాన్ని చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు. రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపినట్లే అంబేడ్కర్‌‌ విగ్రహాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించారు. అంబేడ్కర్‌‌ విగ్రహాన్ని విజయవాడలో పెడితే దళితులకు గౌరవం ఇచ్చినట్లు అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. ఊరికి చివరన అంబేడ్కర్‌‌ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు చూశారు. రెండు వేల కోట్ల విలువ చేసే స్థలంలో అంబేడ్కర్‌‌ విగ్రహం ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు’  అని తెలిపారు

అంతేకాక ‘రానున్న రోజుల్లో స్వరాజ్య మైదానం పర్యాటక స్థలంగా మారుతుంది. విజయవాడ నగరం ప్రపంచ పటంలోకి ఎక్కుతుంది. చంద్రబాబుకు విజయవాడలో అంబేడ్కర్‌‌ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు. ఏడాది కాలంలో దళితులకు జరిగిన సంక్షేమంపై టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధం. దళితులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకుంది వాస్తవం కాదా. కోర్టులో కేసులు వేసి రాజధానిలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే లిటిగేషన్ పార్టీ. బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తూ అంబేడ్కర్‌‌ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి సీఎం జగన్. విగ్రహం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి’ అని సురేష్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు