నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం

30 Jun, 2020 05:15 IST|Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రం లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కళాశాలలు, సంబంధిత కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వీటి ద్వారా సుశిక్షితులైన యువతను వివిధ రంగాలకు అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న అయిదు రోజుల అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎఫ్‌డీపీ) ఉద్దేశించి డిజిటల్‌ వేదిక ద్వారా అమరావతి నుంచి సోమవారం మంత్రి సురేష్‌ మాట్లాడారు.

2020–2025 కొత్త ఇన్నోవేషన్‌ పాలసీని ప్రభుత్వం తీసుకురానుందని చెప్పారు. ‘కరోనా కారణంగా పలు రంగాల మాదిరి విద్యా రంగం కూడా సవాళ్ల్లను  ఎదుర్కొంటోంది. పరీక్షలు, తరగతుల నిర్వహణపై అన్ని వర్గాలు మేధావులు తల్లిదండ్రుల అభిప్రాయానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విభజన అనంతరం రాష్ట్రంలో విద్యారంగానికి, పారిశ్రామిక రంగానికి దూరం కొంత పెరిగింది. దాన్ని అధిగమించే ప్రయత్నం విశ్వవిద్యాలయాలు చేయాలి’ అని మంత్రి సూచించారు. స్టార్టప్‌ ఇంక్యుబేషన్, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ వంటి అంశాలపై దృష్టి సారిస్తే ఉపాధితో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌డీసీ, న్యూఢిల్లీ) సీఎండీ డాక్టర్‌ హెచ్‌.పురుషోత్తం సూచించారు.  

మరిన్ని వార్తలు