నాణ్యమైన విద్యను అందించి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

20 Jun, 2019 12:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చి దిద్దుతామని విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్‌ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు సంస్కరణల కమిటీ ని నియమిస్తూ తొలి సంతకం చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్స్‌ ఫైల్‌పై రెండో సంతకం చేయగా.. పదో తరగతిలో 20శాతం ఇంటర్నల్‌ మార్క్స్‌ను రద్దు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని, మిగిలిన అంశాలపై అధ్యయనం చేసి నిర్ణాయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల కోసం నెలలో ఒకరోజు ఫిర్యాదుల దినంగా నిర్వహిస్తామని అన్నారు. 

యూనివర్సిటీల్లో అక్రమాలను అరికడతామని పేర్కొన్నారు. వీసీలుగా నిష్ణాతులైన వారినే నియమిస్తామని అన్నారు. త్వరలోనే ఎడ్యుకేషన్‌ క్యాలెండర్‌ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మ ఒడి పథకంపై ప్రచారం చేసుకునే ప్రైవేట్‌ స్కూల్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలి ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలేనని తెలిపారు. ప్రైవేట్‌ స్కూల్స్‌పై ఏం చెయ్యాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇంజనీరింగ్‌, ఇంటర్‌అన్ని కాలేజీల్లో ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.

మరిన్ని వార్తలు