కల్తీ కేకులు

1 Jan, 2020 07:54 IST|Sakshi
అరవిందనగర్‌లోని ప్రసాద్‌ అనే వ్యాపారి తయారు చేస్తున్న కల్తీ కేకులు ఇవే

అనంతపురం న్యూసిటీ: నగరంలోని అరవిందనగర్‌లో ఓ బేకరీ నిర్వాహకుడు కల్తీ కేకులు విక్రయిస్తున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలింది. మంగళవారం ఫుడ్‌ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు నగరంలోని వివిధ బేకరీలపై ఆకస్మిక దాడులు చేశారు. అరవిందనగర్‌ మసీదు వెనుక  ఓ షెడ్డులో ప్రసాద్‌ అనే వ్యాపారి కల్తీ కేకులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అసిస్టెంట్‌ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తూనికలు, కొలతల శాఖ సీఐ మహ్మద్‌గౌస్‌కు సమాచారం వచ్చింది. కేకులకు వాడే మైదా పురుగులు పట్టి ఉండడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కేకుల్లో కలర్లు అధికంగా కలపడంతో పాటు చాక్లెట్‌ ఫ్లేవర్‌ కోసం వాడే పౌడర్‌కు తయారీ తేదీ లేదు. ఇప్పటికే వేలాది కేకులు బేకరీలకు సరఫరా అయ్యాయి.

8 బేకరీలకు నోటీసులు  
అనంతరం అధికారులు నగరంలోని ఎనిమిది బేకరీలు, హోటళ్లపై దాడులు నిర్వహించారు. క్లాక్‌టవర్, సప్తగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న బేకరీలకు నోటీసులు జారీ చేశారు. స్వగృహ స్వీట్స్, న్యూ బెంగళూరు బేకరీ నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలనందజేశారు. కార్యక్రమంలో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కరీముల్లా, వినియోగదారుల సంఘం నాయకులు రవీంద్రరెడ్డి  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు