నిరుద్యోగ దీక్షా శిబిరం తొలగింపు.. ఉద్రిక్తత

2 Oct, 2018 11:08 IST|Sakshi
దీక్షా శిబిరం తొలగిస్తోన్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్‌ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ విద్యార్థి సంఘం నేతలు నిరుద్యోగ దీక్షలకు దిగారు. పలుచోట్ల పోలీసులు నిరుద్యోగ శిబిరాలను తొలగించి దీక్షలకు ఆటంకం కల్పించారు. మరికొన్ని చోట్ల విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి.

అనంతపురం: జిల్లాలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నేతలు తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించారు. దీనికి నిరసనగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద విద్యార్థి నేతలు ఆందోళన నిర్వహించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వందలాది మంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే కోపమెందుకని విద్యార్థులు మండిపడ్డారు. టూటౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం పరామర్శించారు. పోలీసుల చర్యను వారు ఈ సందర్భంగా తప్పుబట్టారు.

నిరుద్యోగ భృతి పేరుతో మరోసారి చంద్రబాబు మోసానికి తెరలేపారని, రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసినట్టే నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారని వైస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్‌. సిద్దారెడ్డి ఆరోపించారు. టూటౌన్ పీఎస్‌లో వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం తదితరులు పరామర్శించారు.

విజయవాడ :  వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరుద్యోగ దీక్షకు ధర్నా చౌక్‌లో పోలీసులు అనుమతి నిరాకరించారు.  పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష ప్రారంభించిన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు.

పశ్చిమగోదావరి జిల్లా: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలకు దిగారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ, ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆళ్ల నాని ప్రారంభించారు.

తిరుపతి: ఎస్‌వీయూలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నిరసన దీక్ష. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు. చిత్తూరు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసు భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టాడని విమర్శించారు. అందువల్లే రాష్ట్రంలో పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య ఏర్పడిందని ధ్వజమెత్తారు. పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలకు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయలేదు..ఔట్ సోర్సింగ్ పోస్టులను కుడా టీడీపీ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. 

వైఎస్సార్ జిల్లా: నిరుద్యోగ సమస్యలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో 48 గంటల దీక్షలు. దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా. దీక్షలో పాల్గొన్న విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజారహతుల్లా, యోగివేమన యూనివర్సిటీ విద్యార్థులు.

కర్నూలు: విద్యా, ఉద్యోగం , నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష . కృష్ణ దేవరాయ సర్కిల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బి.వై. రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరిత, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ తదితరులు.

విశాఖపట్నం: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు కాంతారావు, సురేష్, గోవింద్ ఆధ్వర్యం లో 48 గంటల నిరాహార దీక్ష. విద్యార్థి సంఘ నేతల దీక్షలను ప్రారంభించిన నగర అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్. పాల్గొన్న విద్యార్థి సంఘం నేతలు సుధీర్, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్‌తో పాటు విద్యార్థులు
. సంఘీభావం తెలిపిన కన్వీనర్లు తిప్పల నాగిరెడ్డి, డాక్టర్ రమణ మూర్తి, చెట్టి ఫాల్గుణ, జిల్లా మహిళ అధ్యక్షురాలు పీలా వెంకట లక్ష్మీ, కొయ్యా ప్రసాద్ రెడ్డి, కొండ రాజీవ్ గాంధీ, బోని శివరామకృష్ణ తదితరులు.

మరిన్ని వార్తలు