ఈ నెల 30 నుంచి రైతు ముంగిట సేవలు..

11 May, 2020 18:25 IST|Sakshi

అందుబాటులోకి 10,641 రైతు భరోసా కేంద్రాలు

అగ్రికల్చర్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

సాక్షి, విజయవాడ: గ్రామస్థాయిలో రైతుకు వ్యవసాయ అనుబంధ శాఖ సేవలు అన్ని అందుబాటులోకి రావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అగ్రికల్చర్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్వామినాథన్ సిఫార్సు చేసిన సూచనలన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలులోకి తీసుకువస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. 10,641 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో రానున్నాయని, ఈ నెల 30న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారని తెలిపారు. కేంద్రాల్లో  కియోస్క్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉంటారన్నారు. గ్రామ స్థాయిలో ఖరీఫ్ కు సంబంధించిన వరి, వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కియోస్క్ లో పంటలకు సంబంధించి సమాచారం అందుబాటులో ఉంటుంది. కియోస్క్ లు అన్ని ఒకే నెట్ వర్క్‌ గా ఉంటాయన్నారు. ప్రతి కియోస్క్‌ ద్వారా అత్యంత నాణ్యమైన అమ్మకాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

రైతు భరోసా భవనాలు సిద్ధం..
సబ్సిడీ పక్కదారి పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. వ్యవసాయ, హార్టీ కల్చర్, ఫిషరీష్ డిపార్ట్‌మెంట్‌ కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. 10,505 రైతు భరోసా భవనాలను సిద్ధం చేశామని తెలిపారు. నెలాఖరుకు అన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా మట్టి నాణ్యత పరిశీలన వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామాల్లో ఆవులు,గేదెలు,ఎద్దులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

విత్తన పంపిణీకి సిద్ధం..
గ్రామస్థాయిలో విత్తన పంపిణీకి సిద్ధం చేస్తున్నామని ఏపీ సీడ్స్‌ డైరెక్టర్‌ శేఖర్‌బాబు తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచి 8 లక్షలు క్వింటాళ్లు వరి, వేరుశనగా, పెసలు, పిల్లి పెసర సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాలు నుంచి నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు