‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం’

20 Oct, 2019 10:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను అమలుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికి రుణపడి ఉంటామని అగ్రిగోల్డ్ బాధితులు చెప్తున్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి అగ్రిగోల్డ్‌ ఆస్తులు తీసుకున్నారని, కానీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి విడత డబ్బులు విడుదల చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు 263 కోట్ల రూపాలను కేటాయించిన సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హమీని తాజాగా అమలు చేయడంతో పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదని నేడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఐదునెలల్లోనే ఇచ్చిన మాటలను వైఎస్ జగన్ అమలు చేశారని అగ్రిగోల్డ్ బాధితులు అంటున్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులు సంబరాలు
ప్రజాసంకల్పయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయడంతో అగ్రిగోల్డ్‌ బాధితులు సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో వైఎస్ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  చంద్రబాబు హయాంలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని.. కానీ సీఎం జగన్‌ అధికారంలోకి రావడంతోనే తమ సమస్యల పట్ల దృష్టి సారించడం ఆనందంగా ఉందన్నారు.

వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం
వైఎస్‌ఆర్‌ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి అగ్రిగోల్డ్‌ బాధితులు పాలాభిషేకం చేశారు.  అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌ న్యాయం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆకేపటి అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు.  అధికారం చేపట్టిన వెంటనే జగన్‌ బాధితుల కోసం రూ. 1,150 కోట్లు కేటాయించారని.. అందులో మొదటి విడతగా రూ. 265 కోట్లు విడుదల చేశారన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాధితుల కోసం 265 కోట్లు కేటాయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  తమకు ఇదే నిజమైన పండగ రోజని.. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే అన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లాలో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని అంబేద్కర్ సర్కిల్ లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేసిందని వారు మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ కు విశాఖలో మహిళలు ధన్యవాదాలు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో మాకు ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు