ప్రజా సంకల్పయాత్రకు అక్కినేని ఫ్యాన్స్‌ మద్దతు

27 Aug, 2018 07:30 IST|Sakshi

విశాఖసిటీ: ప్రజా సమస్యల కోసం నిరంతరం అధ్యయనం చేస్తూ.. అలుపెరగని పాదయాత్రతో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ ఫ్యాన్స్‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి.రాము యాదవ్‌ ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్పయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను స్వయంగా చూస్తూ ప్రతి ఒక్కరికీ నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమం కోసం జగనన్న పడుతున్న కష్టం చూసి అక్కినేని అభిమానులంతా ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు మద్దతు తెలపాలనీ, ఆయనతో చేయి చేయి కలిపి నడవాలని సంకల్పించామని రాముయాదవ్‌ వివరించారు. ప్రతి ఒక్క అక్కినేని అభిమాని గడపగడపకు తిరుగుతూ నవరత్న పథకాల గురించి వివరించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటామని ప్రకటించారు. త్వరలోనే జగన్‌ను కలిసి వారి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు తామంతా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు