మస్తుగా తాగించారు

18 Jan, 2019 07:53 IST|Sakshi
మద్యం షాపులు

రూ.30 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు

మందుబాబులపై అదనపు బాదుడు

పట్టించుకోని పోలీస్, ఎక్సైజ్‌  అధికారులు

సంక్రాంతి పండుగ రోజులలో మద్యం ఏరులై పారింది. టీడీపీ ప్రభుత్వం మద్యం సిండికేట్‌ పెద్దలు చక్రం తిప్పి ఎమ్మార్పీకంటే అదనపు రేట్లకు అమ్మకాలు సాగించారు. అయినప్పటికి పోలీస్, ఎక్సైజ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లువ్యవహరించారు.

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: జిల్లా వ్యాప్తంగా 535 మద్యం షాపులు ఉండగా, 50కి పైగా బార్లు ఉన్నాయి. వీటితో పాటు అనధికారికంగా సుమారు 200 వరకూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. వీటిలో పండగ మూడు రోజులు రూ.30.42 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటి కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం సిండికెట్‌ వ్యాపారులు క్వాటర్‌ బాటిల్‌ కు రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా వసూలు చేశారు. బార్‌లలో మరింత బాదారు. తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్‌ యూనిట్‌–1 సామర్లకోట(కాకినాడ) యూనిట్‌ పరిధిలో 19,977 బాక్స్‌ల లిక్కర్‌ అమ్మకాలు జరగగా, 20,476 బాక్స్‌ల బీర్‌ అమ్మకాలతో మొత్తం రూ 12.98 కోట్లు అమ్మకాలు జరిగాయి. అలాగే యూనిట్‌–2 రాజమహేంద్రవరం యూనిట్‌ పరిధిలో 16,020 బాక్స్‌లు లిక్కర్‌ అమ్మకాలు జరగగా, 16,356 బాక్స్‌లు బీర్‌ అమ్మకాలతో రూ 10.19 కోట్లు విక్రయించారు. యూనిట్‌–3 అమలాపురం యూనిట్‌ పరిధిలో 14,217 బాక్స్‌లు లీక్కర్‌ అమ్మకాలు జరగగా, 11,481 బాక్స్‌ల బీర్‌ అమ్మకాలు జరిగాయి. రూ 7.25 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే వీటి కంటే అధికంగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

నకిలీ బ్రాండ్‌ అమ్మకాలు
పండగ పుణ్యమా అని నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. కంపెనీ బ్రాండ్స్‌ మాదిరిగానే ఉండే నకిలీ బ్రాండ్‌ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఎక్కువ అమ్మకాలు జరిగే బ్రాండ్లు ఓసీ, డీఎస్పీ, ఎంసీ విస్కీ, ఎంహెచ్‌ బ్రాందీ, చీప్‌ లీక్కర్, తదితర కంపెనీలకు చెందిన నకిలీ బ్రాండ్‌లు అమ్మకాలు జోరుగా సాగాయి.వీటితో పాటు కంపెనీ ఫుల్‌ బాటిల్‌ను కొన్ని చోట్ల లూజు పోసి వాటిలో కల్తీలు చేశారు. మద్యం షాపులలో చీప్‌ లీక్కర్‌ నకిలీ బ్రాండ్‌లను యానాం, తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి విక్రయించారు.   

మరిన్ని వార్తలు