రాజకీయానికి వేళకాదు

22 Dec, 2013 02:49 IST|Sakshi
రాజకీయానికి వేళకాదు

‘సమైక్య’ అఖిలపక్షం అభిప్రాయం
ఇకపైనా ఉద్యోగ జేఏసీ ద్వారానే ఉద్యమం
భేటీని తుస్సుమనిపించిన టీడీపీ, కాంగ్రెస్
రాజకీయ జేఏసీ అవసరమే లేదన్న వైనం
వైఎస్సార్‌సీపీ అనుమానించినంతా జరిగింది
విభజనవాదులతో వేదిక పంచుకోబోమని
ముందే చెప్పిన పార్టీ


సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటుచేయ తలపెట్టిన రాజకీయ జేఏసీకి ఇది సరైన సమయం కాదని శనివారం సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తేల్చేసింది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన ఈ తరుణంలో రాజకీయ జేఏసీ ఏర్పాటుకు యత్నించడం సమయాన్ని వృథా చేయడమేనని నిర్ధారణకు వచ్చింది. ఇప్పటిదాకా నిర్వహించిన తరహాలోనే భవిష్యత్తులో కూడా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగించాలని, రాజకీయ పార్టీలు దానికి మద్దతు ఇవ్వాలని తీర్మానించింది. అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి, ఉద్యోగ సంఘాల ఉద్యమానికి తోడుగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని, సీమాంధ్రలో జిల్లాలవారీగా కూడా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని మరోసారి చెప్పింది.

రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునే అవకాశం ఇప్పుడు ఎమ్మెల్యేల చేతుల్లో ఉందని, కాబట్టి విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో మూకుమ్మడిగా గళం విప్పటమే గాక అఫిడవిట్లు సమర్పించాలని ఆయా పార్టీలను కోరింది. ‘‘సందర్భాన్ని బట్టి రాష్ట్రపతిని కలిసి అఫిడవిట్లు అందజేయాలి. మెజార్టీ ప్రజాప్రతినిధులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్న స్పష్టమైన విషయాన్ని ఆయన ముందుంచాలి. తద్వారా బిల్లుకు అంగీకారం తెలపడంపై ఆయన పునరాలోచించే పరిస్థితి తేవాలి. రాష్ట్రపతిని కలిసే విషయంలో పార్టీలన్నీ కలిసి రావాలి’’ అని వేదిక పక్షాన ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధమయ్యాక దాని ఆచరణలో కూడా పార్టీల పూర్తి సహకారం కావాలన్నారు.

 రాజకీయ జేఏసీ అవసరమే లేదు: కాంగ్రెస్, టీడీపీ

 రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న పార్టీలతో వేదికను పంచుకోవటం ఇష్టం లేదని పేర్కొంటూ ఈ అఖిలపక్షంలో పాల్గొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించడం తెలిసిందే. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ ఏదైతే అనుమానించిందో, అఖిలపక్షంలో సరిగ్గా అదే జరిగింది. సీమాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదేందుకు రాజకీయ జేఏసీ ఏర్పాటుకు ఈ అఖిలపక్షం వేదికవుతుందని భావించగా, టీడీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని తుస్సుమనిపించారు. అసెంబ్లీకి చేరిన బిల్లు అక్కడితో ఆగిపోవాలంటే, అందులో రాజకీయ పార్టీలు పోషించాల్సిన పాత్రే చాలా ఎక్కువగా ఉన్నందున రాజకీయ జేఏసీపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న చర్చ ప్రారంభం కాగానే రెండు పార్టీల నేతలు అందుకు పూర్తి వ్యతిరేక అభిప్రాయాలు వెల్లడించారు. రాజకీయ జేఏసీ అవసరమే లేదన్నారు. ఉద్యోగ సంఘాలు యథావిధిగా ఉద్యమం నిర్వహిస్తే తమ వంతు చేయూతనందిస్తామంటూ తేల్చేశారు. దాంతో అఖిలపక్షం ఏర్పాటే హాస్యాస్పదంగా మారిపోయింది. ఏదో హడావుడి చేస్తున్నారంటూ జనం దృష్టిలో పడేందుకు చేసిన ప్రయత్నంగా మారింది.

ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోకుండా రెండు గంటల పాటు సమావేశాన్ని నిర్వహించి, అంతటితో మమ అనిపించి నేతలు జారుకున్నారు. అఖిలపక్షంతో ఉద్యమానికి కీలక మలుపు ఖాయమనేలా ఎన్నో రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతూ వస్తున్నదంతా వ్యర్థమయ్యేలా కాంగ్రెస్, టీడీపీ నేతలు వ్యవహరించారు. పైగా ఇంతకాలం తమను ఉద్యమంలో కలుపుకోలేదంటూ టీడీపీ నేతలు ఒక దశలో ఏపీ ఎన్జీఓల సంఘం నేతలపై ఎదురుదాడికి కూడా దిగారు.  ప్రస్తుతమున్న ‘వ్యవస్థ’తోనే భావి ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అఖిలపక్షం తర్వాత విలేకరులకు చెప్పడం విశేషం. కాంగ్రెస్ తరపున ఎంపీ సబ్బం హరి, మంత్రి శైలజానాథ్, ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ నుంచి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కేశవ్, కె.యి.ప్రభాకర్, శివరామరాజు ఇందులో హాజరయ్యారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, సీపీఎం నుంచి వై.వెంకటేశ్వరరావు, ఎస్.వీరయ్య, లోక్‌సత్తా నుంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 సొంత ఉద్యమాలే: సీపీఎం, లోక్‌సత్తా

 ‘‘పార్టీలపరంగా కాకుండా ఆయా పార్టీల్లోని నేతలు ప్రాంతాలుగా విడిపోయి చేస్తున్న ఉద్యమంలో కలిసి రాకూడదన్న ఉద్దేశంతోనే ఇంతకాలం సమైక్యోద్యమాన్ని సొంతంగా నిర్వహించాం. ఇక ముందు కూడా ఇదే పంథాను కొనసాగిస్తాం’’ అని సీపీఎం నేతలు వై.వెంకటేశ్వరరావు, వీరయ్యలు భేటీ అనంతరం స్పష్టం చేశారు. లోక్‌సత్తా నేత శ్రీనివాసరావు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మున్ముందు ఉద్యోగ సంఘాలు చేసే సమైక్యోద్యమానికి క్షేత్రస్థాయిలో మద్దతు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల చెప్పారు. సమైక్యానికి కట్టుబడ్డామంటూ ఎమ్మెల్యేలతో రాష్ట్రపతికి అఫిడవిట్లు పంపే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాల ఉద్యమానికి కాంగ్రెస్ పక్షాన మద్దతుంటుందని, ఇతర విషయాలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శైలజానాథ్ అన్నారు.
 
 అఖిలపక్షం విజయవంతం: అశోక్‌బాబు

 ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు సమైక్యానికి కట్టుబడి ఉన్నామంటూ అఫిడవిట్లు ఇవ్వాలంటూ భేటీ తీర్మానించిందని అశోక్‌బాబు చెప్పారు. ఉద్యమం మొదలయ్యాక మున్నెన్నడూ లేనివిధంగా సమైక్యానికి అనుకూలంగా ఉన్న పార్టీలను ఒక్కచోటికి తెచ్చినందుకు ఈ భేటీ విజయవంతమైందనే భావిస్తున్నామన్నారు. ‘‘సమైక్యానికి కట్టుబడి ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేసిన వైస్సార్‌సీపీ సొంత కారణాలతో భేటీకి రాలేదు. అది ఆ పార్టీ విధాన నిర్ణయమైనందున దాన్ని గౌరవిస్తాం’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు