అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపు

3 Apr, 2015 16:10 IST|Sakshi

చింతూరు(ఖమ్మం) :  ఖమ్మం జిల్లా చింతూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌తో అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలలో శనివారం బంద్ పాటించాలని కోరుతూ శుక్రవారం చింతూరులో అఖిలపక్షం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఎటపాకను రెవెన్యూ డివిజన్ చేయడంవలన భవిష్యత్తులో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి చింతూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, లేదంటే మున్ముందు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మూడు మండలాలకు చెందిన ప్రజలు, వ్యాపారులు బంద్‌కు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఎంపీపీ చిచ్చడి మురళి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామలింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ హబీబ్, అహ్మద్‌అలీ, సీపీఐ మండల కన్వీనర్ ఎస్ కే రంజాన్, సీపీఎం నాయకులు సీతారామయ్య, కోట్ల కృష్ణలు పాల్గొన్నారు. కాగా ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్(రాజపత్రం)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు