మహాయజ్ఞానికి సర్వం సిద్ధం

20 Apr, 2018 06:55 IST|Sakshi
యాగశాల

శ్రీచక్రపురం పీఠంలో నేటి నుంచి  కోటి శివలింగ యాగం

ఎచ్చెర్ల క్యాంపస్‌ : ఎచ్చెర్ల మండలం కొంచాల కూర్మయ్యపేట సమీపంలోని శ్రీచక్రపురం పీఠంలో శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు 1001 మేరువుల కోటి శివలింగాల సంస్థాన మహాయజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం ఏడు గంటల నుంచి మహాయాగ పూజలు ప్రారంభం కానున్నాయి. శ్రీచక్రపురం పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కరశర్మ, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మహాయజ్ఞం అనంతరం కోటి శివలింగాల మహాక్షేత్రం నిర్మాణం చేపట్టనున్నారు. రోజుకు ఆరువేల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లు, అన్న సంతర్పణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్పటిక లింగాన్ని ఊరేగించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. జిల్లా స్థాయిలో భారీగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమం కావడంతో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు కోటి రుద్రాక్షలతో రుద్రాభిషేకం, కోటి కుంకుమార్చన కార్యక్రమాలతో పూజ ప్రారంభం కానుంది. టస్ట్రు కమిటీ సభ్యులు హనుమంతు కృష్ణారావు, కోరాడ రమేష్, టి.నాగేశ్వరరావు, దుప్పల వెంటకరావు, పప్పల రాధాకృష్ణ, రమేష్, పైడి చంద్, అంధవరపు వరహా నర్సింహం, పొన్నాల జయరాం, గీతా శ్రీకాంత్‌ గురువారం యాగస్థలాన్ని పరిశీలించారు.  

ఏర్పాట్లు పూర్తి చేశాం.. మహాయజ్ఞానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం. రోజుకు ఆరు వేల మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నాం. రుద్రాక్ష యాగం, స్పటిక లింగానికి నిరంతరం క్షీరాభిషేకం చేయడంతతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. రోజుకు 300 దంపతులు పూజల్లో పాల్గొంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి భక్తులు హాజరుకావాలి.
 – తేజోమూర్తుల బాలభాస్కరశర్మ,శ్రీచక్రపురం పీఠాధిపతి

మరిన్ని వార్తలు