ప్రత్యేకత చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే

4 Jun, 2019 17:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన ప్రత్యేకత చాటుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేశారు. తాడేపల్లి వద్ద ఉన్న పోలకంపాడులో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహం కాళ్లు దెబ్బతినడంతో స్వయంగా తాపీ పట్టి సిమెంట్‌ చేశారు. తర్వాత మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కారం చేశారు. గాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు.

స్వతహాగా రైతు అయిన ఆర్కే నిరాడంబర జీవితం గడుపుతుంటారు. గతంలో లైనులో నిలబడి 5 రూపాయల భోజనాన్ని రుచి చూశారు. అంతేకాదు తన నియోజకవర్గంలోనూ ఈ సదుపాయం కల్పించి ప్రజల మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేశ్‌పై ఆర్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు