ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఆర్కే

8 Nov, 2019 19:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'కనెక్ట్‌ టు ఆంధ్రా' ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ఐదేళ్ల ఎమ్మెల్యే జీతాన్ని 'కనెక్ట్‌ టు ఆంధ్రా'కు విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ చార్యులును కలిసి లేఖ అందజేసినట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌ అమ్మ ఒడి, నాడు-నేడు, నవరత్నాల అమలుకు ' కనెక్ట్‌ టు ఆంధ్రా పేరుతో ప్రజా భాగస్వామ్యాన్ని కోరడం మంచి విషయమని ఆర్కే పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన ‘కనెక్ట్‌ టూ ఆంధ్రా’ వెబ్‌ పోర్టల్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.. సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ వెబ్‌పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

మరిన్ని వార్తలు