కుటుంబ వివాదాలను రాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే

1 Jul, 2019 08:23 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు

దళిత బహుజన మహాసభ జిల్లా

అధ్యక్షుడు అల్లడి శ్యాంబాబు విమర్శ

సాక్షి, చినగంజాం (ప్రకాశం): కుటుంబ వివాదాలను టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాజకీయం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్‌ దళిత బహుజన మహాసభ జిల్లా అధ్యక్షుడు అల్లడి శ్యాంబాబు అన్నారు. ఆదివారం చినగంజాంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్‌ దళిత బహుజన మహాసభ తరపునఎమ్మెల్యే చర్యలను ఖండించారు. నిన్నమొన్నటి వరకు కూలాల మధ్య చిచ్చు రగిల్చి, దళిత బహుజనులను విడదీసి వివాదాలను పెంచి పోషించారని విమర్శించారు. రాజకీయ అధికారంతో గ్రామాల్లో దళిత భూములను అన్యాక్రాంతంగా తన తాబేదార్లకు కట్టబెట్టి దళిత, దళారీలను ప్రోత్సహిస్తూ దళితులకు టీడీపీఎమ్మెల్యే ఏలూరి అన్యాయం చేసారని ఆరోపించారు.

ప్రస్తుతం కుటుంబ కలహాలను కూడా రాజకీయం చేసి గ్రామాల్లో వివాదాలను పెంచి విద్వేషాలను రెచ్చగొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ధ్వజమెత్తారు. రుద్రమాంబపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య చాలాకాలంగా తగాదాలు జరుగుతూ వారి మధ్య వైరం పతాక స్థాయికి చేరుకొని కుటుంబంలోని ఒక మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు పొగొట్టుకుని వారి కుటుంబం శోకమయమై అల్లాడుతుంటే ఆ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఆ గ్రామాల్లోని టీడీపీ నాయకులు అమాయకులైన మహిళలను కేసుల్లో ఇరికించి వారిని వేధింపులకు గురిచేస్తూ వారికి శిక్షలు వేయించేం దుకు పోరాడటం సమంజసం కాదన్నారు. ఇందుకోసం వైఎస్సార్‌ సీపీ నాయకులపై అనవసరంగా బురద చల్లడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్‌ మహ్మద్‌ షా, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు