18 ఏళ్లు.. ఎన్నో మలుపులు

30 Oct, 2019 10:29 IST|Sakshi

కొలిక్కిరాని ధన బ్యాంకు కుంభకోణం వ్యవహారం

న్యాయం కోసం ఖాతాదారుల ఎదురుచూపు 

ఏలూరు (పశ్చిమగోదావరి) : జిల్లాలో సంచలనం సృష్టించిన ధన బ్యాంకు కుంభకోణం వ్యవహారం దాదాపు 18 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. అప్పట్లో రూ.3 కోట్ల నిధుల కుంభకోణంపై ఏలూరు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది. కొద్దికాలం కోర్టులో కేసు విచారణ కొనసాగింది. అయితే దీనిపై కోర్టు తీర్పు వెలువరించే సమయానికి (2013)లో బ్యాంక్‌ చైర్మన్‌ పరారవడంతో కేసు విచారణ మందగించింది. ఇటీవల రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కావడంతో కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటివరకూ అజ్ఞాతంలో ఉన్న ధన బ్యాంకు చైర్మన్‌ దాదాపు ఆరేళ్ల తర్వాత సెపె్టంబర్‌ 5, 2019లో లొంగిపోవడంతో కేసులో కదలిక మొదలైంది. దీంతో నాటి ధన బ్యాంకు ఖాతాదారుల్లో తమకు న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. 

ఇదీ ధన బ్యాంకు చరిత్ర 
జిల్లా కేంద్రమైన ఏలూరులో ధన బ్యాంకును ఏర్పాటు చేసేందుకు 5.10.1999లో రిజి్రస్టేషన్‌ చేశారు. బ్యాంకు ఏర్పాటుకు మూలధనంగా రూ.50 లక్షలు చూపారు. దీని ఆధారంగా ఆర్‌బీఐ ధన బ్యాంకుకు లైసెన్స్‌ను జారీ చేసింది. అనంతరం 27.2.2000లో ధన బ్యాంకును ఏర్పాటుచేశారు. అయితే బ్యాంకు ప్రారం¿ోత్సవానికి ముందే షేర్‌ కాపిటల్‌గా చూపిన సొమ్ములో 95 శాతాన్ని ఖర్చు చేసినట్లు సమాచారం. భవన నిర్మాణం, విద్యుత్, గ్రానైట్, ఫిట్టింగులకు కలిపి 1999–2000 ఆర్థిక సంవత్సరంలో రూ.47.30 లక్షలు ఖర్చు చేశారు. అంటే మూలధనంలో 95 శాతం ఖర్చు చేసి కేవలం 5 శాతం నిధులతోనే బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

మినిమమ్‌ షేర్‌ కాపిటల్‌ లేని బ్యాం కుకు కో–ఆపరేటివ్‌ ఆడిటర్లు 2001, మార్చి వరకూ ఏ గ్రేడు సరి్టఫికెట్‌ ఇచ్చారు. అడ్రస్‌ లేని కంపెనీకి (లార్డ్‌విన్‌ అండ్‌ ఫ్రూట్‌వెల్‌ కంపెనీ) ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రూ.50 లక్షలు ఓవర్‌ డ్రాఫ్టును బ్యాంకు మంజూరు చేయడం జరిగింది. దీనిపై ఆర్‌బీఐ, కో–ఆపరేటివ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చూసీచూడనట్లుగా వదిలివేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

బైలాను సైతం అతిక్రమించిన నిర్వాహకులు 
ధన బ్యాంకు నిర్వహణలో బైలాను సైతం అతిక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు బైలా నెం.3 ప్రకారం ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ జిల్లాలోనే జరగాలి. అయితే దీనిని సైతం కాలరాసి హెచ్‌డీఎఫ్‌సీ విజయవాడ, హైదరాబాద్‌లో బ్యాంకు పేరున కరెంటు ఖాతాలు నిర్వహించారు. ఆర్‌బీఐ, కో–ఆపరేటివ్‌ ఆడిటర్లు ధన బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లావాదేవీలను చూపడం ద్వారా ఈ విషయం అప్పట్లో బహిర్గతమైంది. ఈ విషయాన్ని సైతం నాటి అధికారులు నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆర్‌బీఐ, కో–ఆపరేటివ్‌ అ«ధికారులు, ఆడిటర్ల నిర్లక్ష వైఖరిని చాకచక్యంగా ధన బ్యాంకు ఎక్స్‌పర్ట్‌ డైరెక్టర్‌పైకి నెట్టివేశారనే వాదనలు అప్పట్లో వినిపించాయి. 

27 మంది అరెస్ట్‌ 
ధన బ్యాంకు కుంభకోణంలో 11.5.2002న ఏలూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో మరుసటి రోజైన 12.5.2002 నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయాయి.  రూ.3 కోట్ల కుంభకోణానికి సంబంధించి బ్యాంకు చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్, ప్రమోటర్లు, డైరెక్టర్లు కలిపి మొత్తం 27 మందిని అరెస్టు చేశారు. అయితే రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్న కొందరు ప్రమో టర్లు, డైరెక్టర్లను చార్జిïÙటు నుంచి తప్పించారనే విమర్శలు ఉన్నాయి. 2002లో కేసు నమోదు కాగా 2007లో దీనికి సంబంధించిన చార్జిïÙటు ను వేశారు. అనంతరం ఏలూరు జిల్లా స్పెషల్‌ కోర్టులో 2012 నుంచి కేసు విచారణ మొదలైంది. దీనికి సంబంధించి మే, 2013న తీర్పు వెలువడే సమయానికి బ్యాంకు చైర్మన్‌ పరారవడంతో తీర్పు నిలిచిపోయింది. దీంతో కేసు విచారణ నత్తనడకన సాగుతూ వచ్చింది. తిరిగి మార్చి, 2017లో కేసు విచారణ పుంజుకుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు మారడం, కొత్తగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రావడం తో ఆరేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న  బ్యాంకు చైర్మన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 5న లొంగిపోయారు. దీంతో కేసు తీర్పు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నట్టు న్యాయ నిపుణులు చెబుతున్నారు. 

బెయిల్‌పై చైర్మన్‌ 
తాజాగా లొంగిపోయిన చైర్మన్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తాను ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నట్లుగా ఆయన ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమరి్పంచడంతో రూ.50 వేలు విలువ కలిగిన రెండు పూచీకత్తులపై చైర్మన్‌కు కోర్టు కండిషనల్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 27 మందిని ఆరెస్టు చేయగా వీరిలో ఆరుగురు చనిపోయారు. ప్రతి 15 రోజులకు కేసు వాయిదా పడుతుండటంతో దీనికి సంబంధించి త్వరలోనే తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే రూ. 3 కోట్లు నిధులు, బంగారం లాకర్లలో ఉన్నట్లు నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు విని్పసున్నట్లు సమాచారం. దీనిపై నిజనిజాలు కేసు విచారణలో తేలనుంది. 

చెక్కుల జారీతో గుట్టురట్టు 
ఖాతాదారుల నుంచి డీడీల అప్లికేషన్లు తీసుకుని ధన బ్యాంకు జారీ చేసిన చెక్కులు చెల్లుబాటు కాకపోవడంతో బ్యాంకు గుట్టురట్టయ్యింది. అప్పట్లో రూ.20 లక్షల మేర చెక్కులను బ్యాంకు ద్వారా జారీ చేసినట్లు సమాచారం. దీంతో బ్యాంకులో అవతవకలు జరిగినట్లు బయటకు వచ్చింది. అయితే బ్యాంకు కుంభకోణంలో ఎటువంటి సం బంధం లేని వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆస్తులను పోలీసులు అటాచ్‌ చేశారని, ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమనే ఆరోపణలు సైతం అప్పట్లో వచ్చాయి. 

ఖాతాదారుల్లో చిగురిస్తున్న ఆశలు 
ధన బ్యాంకు వ్యవహారంలో నష్టపోయిన ఖాతాదారుల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి. ఈ కేసు పురోగతిలో ఉండటంతో త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వారిలో వ్యక్తమవుతోంది. బ్యాంకులో ఎంత మొత్తంలో డిపాజిట్‌ చేసినా గరిష్టంగా రూ.లక్ష వరకూ బీమా లభించింది. అంతకన్నా పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేసిన వారికి సైతం అదే రూ.లక్ష ఇవ్వడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. కేసు విచారణ పూర్తయితే తమకు రావాల్సిన మొత్తం వస్తుందనే ఆశ వారిలో వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు