ఎంత...ఘోరం

16 Aug, 2014 03:49 IST|Sakshi
ఎంత...ఘోరం
  • రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం
  •      గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
  • కేఎల్‌ఎం హాస్పిటల్ (రేణిగుంట) : ఉదయం కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడిపారు. గుడికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై  తల్లి, కొడుకు, ఆమె తమ్ముడు బ యలుదేరారు. 45 నిమిషాలు గడవగానే మృత్యువు రూపంలో లారీ ఎదురొచ్చింది. తల్లీకొడుకును పొట్టన  పెట్టుకుంది. ఈ సంఘటన రేణిగుంట మండలం కేఎల్‌ఎం హాస్పిటల్ సర్కిల్ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. బాలాజీ (12) అక్కడికక్కడే మృతిచెందగా, అమరావతి (40) తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతులు ఏర్పేడు మండలం, చింతపాళెంవాసులు. అమరావతి తమ్ముడు ఉమాశంకర్ స్పల్పగాయూలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
     
    అసలు ఏం జరిగిందంటే...
     
    ఏర్పేడు మండలం చింతపాళెం దళితవాడకు చెందిన కృష్ణయ్య అతని భార్య అమరావతి తిరుపతి రూరల్ మండలంలోని పుదిపట్లలో ఏడో తరగతి చదువుతున్న వారి కుమారుడు బాలాజీకి ఆరోగ్యం సరిలేద ని గురువారం చూసేందుకు వెళ్లారు. రేణిగుంట మం డలం అత్తూరులోని గుడికి వెళ్లేందుకు అమరావతి, బాలాజీ, ఆమె తమ్ముడు ఉమాశంకర్‌తో ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. కేఎల్‌ఎం హాస్పిటల్ వద్దకు రాగానే ఎదురుగా తిరుపతి వైపు వెళ్తున్న లారీ ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. బాలాజీ అక్కడికక్కడే మరణించాడు.

    అమరావతి తీవ్రంగా గాయపడగా, ఉమాశంకర్ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108లో తిరుపతి రుయూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమరావతి మృతి చెందింది. స్థానికులు, గాజులమండ్యం పోలీసులు వెంటాడి లారీని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. డ్రయివర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ ఎస్‌ఐ సుబ్రమణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
     
    బాగా చదువుకుంటాడనుకున్నా :  రోదిస్తున్న మృతుని తండ్రి
     
    బాగా చదివి కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా జరిగిందేమిటి నాయనా అంటూ బాలాజీ తండ్రి కృష్ణయ్య బోరున విలపించారు. కృష్ణయ్యకు ముగ్గురు కుమార్తెలు,కుమారుడు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. కృష్ణయ్య తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు