కిరణ్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి 

23 Jul, 2020 13:01 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: మాస్క్‌ వివాదంలో ప్రాణాలు విడిచిన యువకుడు కిరణ్‌ మృతదేహానికి చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత నివాళర్పించారు. యువకుడి అంత్యక్రియలు కార్యక్రమంలో పాల్గొన్న ఆమంచి కృష్ణమోహన్‌.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని  హామీ ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కిరణ్‌ మృతిపై విచారణ చేస్తామని అడిషనల్‌ ఎస్పీ గంగాధర్‌ తెలిపారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే.

పోలీసులు దాడి చేయడం వల్లనే ఆ యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని బంధువులు, దళిత సంఘాలు ఆరోపిస్తుండగా,  మాస్కు ఎందుకు వేసుకోలేదని అడిగినందుకు తమతో వాగ్వాదానికి దిగాడని, అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు తీసుకెళ్తుండగా పోలీస్‌ జీపు నుంచి కిందకు దూకాడని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారు. పూర్తిస్థాయి విచారణ చేయించాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతి చెందిన కిరణ్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని వార్తలు