బొత్సను కలిసిన రాజధాని ప్రాంత రైతులు

11 Jan, 2020 17:14 IST|Sakshi

గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం

సమస్యలుంటే చెప్పండి, సానుకూలంగా పరిశీలిస్తాం

అమరావతి ప్రాంత రైతులకు మంత్రి బొత్స భరోసా

పురపాలక శాఖ మంత్రిని కలుసుకున్న పలు గ్రామాల రైతులు

సాక్షి, అమరావతి: రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులుకొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ఇవే కాకుండా వారికి ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులకు సంబంధించిన ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. 

రాజధాని ప్రాంతంలోని రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు శనివారం మంత్రి బొత్స సత్యనారాయణను విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. భూముల క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షల కారణంగా, ఇంట్లో పెళ్లిల్లు, ఇతరత్రా అవసరాలకు , భూములను అమ్మలేక పోతున్నామని, ఫలితంగా ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా రైతులు మంత్రికి వివరించారు. 

అంతే కాకుండా లంక ప్రాంతాల్లోని భూముల సమస్యలను కూడా ప్రస్తావించారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఆ సమావేశంలో అసైన్డ్‌ భూముల విక్రయాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రైతులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. అలాగే అభివృద్ధి పనులకు వినియోగించని, తమ భూములను తిరిగి ఇచ్చే ఆలోచన చేయాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వీటిని ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకుని వెళతానని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు