మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం

5 May, 2020 15:45 IST|Sakshi

మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారు

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : అంబటి

సాక్షి, తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నింబంధనలను, ఆంక్షలను ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. మొదటి  ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, దశల వారీగా మద్య నిషేధం జరుగుతుందని తెలిపారు. రోజురోజుకు కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్నాయని, వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లో కరోనా తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ కరోనా ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి స్పష్టం చేశారు.  ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. (ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..)

మంగళవారం స్థానికంగా జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. ‘మద్యం అమ్మకాలపై కూడా కేంద్రప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది​. దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. మద్యం అమ్మకాలపై చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?. మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని స్పష్టంగా చెప్పాం. గతంలో ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే.. చంద్రబాబు తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతికహక్కు చంద్రబాబుకు లేదు. మద్యం బ్రాండ్ల గురించి చంద్రబాబుకు ఎందుకంత బాధ?. హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో కరోనా వస్తే.. ఎందుకు దాచిపెట్టారు?’ అని నిలదీశారు. (మద్యం ధరలు పెంచడానికి కారణం అదే)

మరిన్ని వార్తలు