చంద్రబాబుకు... పవన్ కల్యాణ్ ఓ లెక్కా ?

9 Jul, 2015 13:20 IST|Sakshi
చంద్రబాబుకు... పవన్ కల్యాణ్ ఓ లెక్కా ?

హైదరాబాద్: కృష్ణాజిల్లా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. గురువారం హైదరాబాద్లో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఓ మహిళా అధికారిపై దాడి చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వం నిలదీశారు. ప్రశ్నించిన అధికారులపై టీడీపీ ఎదురు కేసులు పెడుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో అటవీక పరిపాలన సాగుతోందని విమర్శించారు. అధికారులను ముట్టుకోవద్దన్నందుకే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని గుర్తు చేశారు. అవినీతి ప్రశ్నిస్తున్న అధికారులను వైఎస్ఆర్ సీపీకి చెందిన వారగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.


అందితే జుట్టు... లేకుంటే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలను ప్రశ్నించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై ఎదురుదాడి చేయడం తగదని అభిప్రాయపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో పవన కల్యాణ్తో ప్రచారం చేయించారని అన్నారు. మనుషులను వాడుకుని వదిలి వేయడంలో చంద్రబాబును మించినవారు లేరన్నారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలనే వాడుకుని వదిలేసిన చంద్రబాబుకు... పవన్ కల్యాణ్ ఓ లెక్కా ? అని అంబటి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీలను ప్రశ్నించిన పవన్ కల్యాణ్ను టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని ప్రశ్నిస్తారా అంటూ టీడీపీ ఎంపీలను అంబటి రాంబాబు నిలదీశారు. మీ అవినీతిని ప్రశ్నించినవారందరూ టీఆర్ఎస్తో కుమ్మక్కైనట్లేనా అంటూ టీడీపీ నేతలను అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు