తాడేపల్లిలో అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలు

6 Dec, 2019 12:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలను శుక్రవారం వైఎస్సార్‌ సీపీ పార్టీ కార్యాలయంలో
నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, ఎస్సీ(మాదిగ) కార్పోరేషన్‌ ఛైర్మన్‌ కనకారావు మాదిగ, పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజతో పాటు పలువురు పార్టీ నేతలు హాజరై.. అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఉపయుక్తమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ ఆలోచన విధానంలోనే అందరూ నడవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అభిలాషించారు. అంబేడ్కర్‌ ఆలోచన విధానం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందరూ అండగా నిలవాలని అన్నారు.  అంబేడ్కర్‌ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.

ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున  మాట్లాడుతూ..  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల అభ్యున్నతికి అంబేడ్కర్‌ చూపిన బాటలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నడుస్తోందని పేర్కొన్నారు. దళితులను సామాజిక, రాజకీయ, ఆర్థికపరంగా అభివృధ్ది చెందేలా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటు చేస్తానని చెప్పి.. దళితులతో పాటు అంబేడ్కర్‌ను సైతం మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. దళితులపై దాడులు చేసి, వారి భూములు లాక్కొని భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు