ప్రేమించిన వాడికోసం 40 కి.మీ. ఒంటరి నడక!

10 Apr, 2020 08:46 IST|Sakshi

మచిలీపట్నం: కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన వేళ.. ఓ యువతి మాత్రం ప్రేమించిన వాడికోసం ఏకంగా 40 కిలోమీటర్లు ఒంటరిగా నడిచివెళ్లింది. కుటుంబ సభ్యుల బెదిరింపులు.. కరోనా భయాలు ప్రియుడి చెంతకు చేరేందుకు ఆమెకు అడ్డుకాలేదు. మొండి ధైర్యంతో ముందుకు సాగిన సదరు యువతి ఎట్టకేలకు ప్రేమించినవాడితో మూడు ముళ్లు వేయించుకుంది.  వివరాలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయి పున్నయ్య, హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన సీహెచ్‌ భవానీ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు.
(చదవండి: కరోనా: ప్రాణాలతో ఆటలు!)

వారి విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పున్నయ్యకు ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగారు. దీంతో ప్రేమికులిద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో భవానీ హనుమాన్‌ జంక్షన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నానికి  ఒంటరిగా బయల్దేరి వెళ్లి ప్రేమించినవాడిని కలుసుకుంది. అక్కడ పున్నయ్య, భవానీ బుధవారం వివాహం చేసుకున్నారు. వారి వినతిపై పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి, నూతన జంటను వారివెంట పంపించారు.
(చదవండి: మూడే ముళ్లు.. ఏడుగురే అతిథులు)

మరిన్ని వార్తలు