చీకట్లను చీల్చుకొని..

31 Dec, 2019 08:55 IST|Sakshi
మార్చి 18 రాయదుర్గం సభలో మాట్లాడుతున్న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అనంతపురం: జిల్లా వాసుల జీవితాల్లో 2019 గమ్మత్తైన ప్రయాణాన్ని సాగించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. సంక్షేమ వెలుగులు ప్రసరించడంతో జిల్లాలో చీకట్లు వైదొలుగుతూ వచ్చాయి. పాలనలో సంస్కరణలు అన్ని వర్గాలకు కొత్త జీవితాన్ని అందించాయి. జనవరి మొదలు.. డిసెంబర్‌ వరకూ సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను 2019 మిగిల్చింది. ఉత్సాహవంతులైన యువ అధికారుల నియామకం.. వారి ఆలోచనల్లో కొత్తదనం ఫలితంగా జిల్లాలో పెనుమార్పులు చోటు  చేసుకుంటూ వచ్చాయి. కాస్త చేదు మిగిల్చినా.. మొత్తానికి జిల్లాలో గత పాలకులు మిగిల్చిన చీకట్లను పారదోలడంలో 2019 సాగించిన  విజయప్రస్థానంపై మంత్‌ టు మంత్‌ రిపోర్ట్‌ మీ కోసం.  

జనవరి:
10వతేదీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇచ్చాపురంలో దిగ్విజయంగా పూర్తి అయిన సందర్భంగా జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. 

ఫిబ్రవరి:
18వ తేదీ: ఏలూరు సభలో బీసీ డిక్లరేషన్‌పై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టతనివ్వడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.  

మార్చి: 
10వ తేదీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను కలెక్టర్‌ విడుదల చేశారు. అదే రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 
18వ తేదీ: రాయదుర్గంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. 
25వ తేదీ: తాడిపత్రిలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ వేదికపై నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.  
 30వ తేదీ: సోమందేపల్లి, మడకశిర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.  
31న: కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.

ఏప్రిల్‌: 
4వ తేదీ: హిందూపురం, కళ్యాణదుర్గంలో వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు 
11వ తేదీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగింది. 14 నియోజవకర్గాల పరిధిలో చిన్నపాటి సంఘటలనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. 

మే:
14వ తేదీ: పది పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 95.55 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానంలో అనంత జిల్లా నిలిచింది. 2,971 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌పాయింట్లు సాధించారు.  
23వ తేదీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. 12 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.

జూన్‌:
7వ తేదీ: జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.  
9వ తేదీ: జిల్లా ఎస్పీగా సత్యయేసుబాబు బాధ్యతలు స్వీకరించారు.  

జూలై:  
9వ తేదీ: జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. 
19వ తేదీ: సర్వజనాస్పత్రి అభివృద్ధికి రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో అదనపు భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.

ఆగస్టు:
► 8వ తేదీ: కియా పరిశ్రమలో తొలి కారు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ, పీఐఐసీసీ చైర్‌పర్సన్‌ ఆర్‌.కె.రోజా పాల్గొన్నారు.  
19వ తేదీ: ఎమ్మెల్సీగా విశ్రాంత ఐజీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనమండలి చాంబర్‌లో రిగర్నింగ్‌ అధికారి బాలకృష్ణమాచార్యలు ప్రకటించారు.    

సెప్టెంబర్‌:
26వ తేదీ: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ జిల్లాకు విచ్చేశారు. భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తీరును మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, విప్‌ కాపు రామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు.

అక్టోబర్‌:
1వ తేదీ: జిల్లాలో గ్రామ సచివాలయాల వ్యవస్థను మంత్రి శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు ప్రారంభించారు.  
10వ తేదీ: వైఎస్సార్‌ కంటి వెలుగు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతలో ప్రారంభించారు.  
22వ తేదీ: ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యుడిగా రాష్ట్ర విద్యాసంస్కరణల కమిటీ సభ్యుడు ఆలూరి సాంబశివారెడ్డి నియమితులయ్యారు.

నవంబర్‌:
 8వ తేదీ:  అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20.64 కోట్ల మెగా చెక్కును ప్రజాప్రతినిధులు అందజేశారు.  
17వ తేదీ: కనకదాస జయంతిని అధికారికంగా జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.  
22వ తేదీ: పుట్టపర్తిలో సత్యసాయి 94వ జయంత్యుత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 38వ స్నాతకోత్సవం జరిగింది. కార్యక్రమానికి డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

డిసెంబర్‌: 
 2వ తేదీ: జిల్లాకు 100వ కలెక్టర్‌గా గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించారు.  
► 5వ తేదీ: కియా గ్రాండ్‌ సెర్మనీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, కియా మోటార్స్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి మొదలైతే మరిన్ని ఉద్యోగాలు జిల్లా వాసులకు దక్కుతాయని ఆయన అన్నారు.  
► 6వ తేదీ: 36 సంవత్సరాలుగా తమకు సేవలందిస్తూ వచ్చిన దంపెట్ల నారాయణ యాదవ్‌ మృతి చెందడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సతీసమేతంగా ముదిగుబ్బ మండలం దిగువపల్లికి వచ్చారు.  
► 9వ తేదీ: ఎస్కేయూ వీసీ ఫ్రొఫెసర్‌ జయరాజ్‌ హఠాన్మరణం.  
► 11వ తేదీ: డీసీసీబీ చైర్మన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన పామిడి నివాసి మానుకింద వీరాంజినేయులు బాధ్యతల స్వీకరణ.  
► 18వ తేదీ: మూడు రోజుల పాటు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.  
►  21వ తేదీ: వైఎస్సార్‌ నేతన్న నేస్తంను ధర్మవరం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో 27,481 మంది నేతన్నలకు లబ్ది చేకూరింది.    

మరిన్ని వార్తలు