130 కి.మీ నడిచిన నిండు గర్భిణి
సాక్షి, అనంతపురం : లాక్డౌన్ వేళ కాలినడకన స్వస్థలానికి బయలుదేరిన నిండు గర్భిణికి అనంతపురం పోలీసులు సాయం అందించారు. గర్భిణి అస్వస్థతకు గురికావడం గుర్తించిన అధికారులు.. ప్రత్యేక వాహనం ఏర్పాటుచేసి ఆమెతోపాటుగా ఇతర కుటుంబ సభ్యులను కూడా స్వస్థలాలకు పంపించారు. లాక్డౌన్ వేళ విధులు నిర్వర్తించడమే కాకుండా.. అవసరమైన వారికి సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చెళ్లికెర వలసకూలీలుగా ఉన్న గర్భిణి సలోని కుటుంబ సభ్యులు వారి స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలికి కాలినడకన బయలుదేరారు. అయితే 130 కి.మీ నడిచిన తర్వాత గర్భిణీ అస్వస్థతకు గురికావడంతో పోలీసులు షల్టర్ కల్పించారు. సలోని చేతిలో 2 ఏళ్ల పాప కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఉద్యోగి పద్మావతి.. వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు. ఆ వాహనానికి ఈ-పాస్ అనుమతి జారీ చేసి పొదిలికి తరలించారు.