శుద్ధజలం.. అబద్ధం

25 Mar, 2018 08:58 IST|Sakshi
నగరంలోని ఓ ప్లాంట్‌ వద్ద మామూలు నీళ్లనే వాటర్‌ క్యాన్లలో నింపుతున్న దృశ్యం

ప్రజారోగ్యంతో చెలగాటం..

మినరల్‌ కాదు జనరల్‌ వాటరే 

ప్రమాణాలు పాటించని ప్లాంట్లు 

స్వచ్ఛమైనవని తాగితే రోగాలు 

తనిఖీలు చేయని అధికారులు

జిల్లాలో అనధికారికంగా వాటర్‌ ప్లాంట్లు వెలిశాయని, ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా నీటిని అమ్ముతున్నారని, ఈ నీరు తాగడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదముందని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌) అధికారులు 2016లో అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్, కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫుడ్, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఉన్న మూడు వేల వాటర్‌ప్లాంట్లలో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్‌ఐ అనుమతి ఉందని అధికారులు తేల్చారు.  
 
గుంటూరులో కలుషిత నీరు తాగి 17 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. మినరల్‌ వాటర్‌ పేరుతో వేలాది వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.  
 
బీఐఎస్‌ అనుమతుల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాత ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్, టీడీఎస్‌ ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించాలి. కానీ ఇటువంటి ప్రమాణాలేవీ పాటించకుండానే వాటర్‌ ప్లాంట్లు అక్రమంగా నడుపుతున్నట్లు ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో తేలింది.

అనంతపురం న్యూసిటీ:  జిల్లాలో వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్‌ పేరుతో అక్రమ దందా చేస్తున్నారు. వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం...ఇదే అదునుగా వాటర్‌ప్లాంట్‌ నిర్వాహకులు మినరల్‌ వాటర్‌ పేరిట గరలాన్ని ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) గుర్తింపు లేకుండా జిల్లాలో మూడు వేలకు పైగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్‌ఐ గుర్తింపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రూ 10 నుంచి 15 లక్షల మంది మినరల్‌ నీటిని తాగుతూ అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి నెలకొనింది. తాగునీటి నాణ్యతను పరిశీలించాల్సిన రెవెన్యూ, పుడ్‌కంట్రోల్‌ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. 

ప్రమాణాలేవీ?  
వాస్తవంగా బీఐఎస్‌ 60 రకాల నాణ్యత ప్రమాణాల పాటించాలని దిశానిర్ధేశం చేస్తోంది. కానీ నీటి శుద్ధి ప్లాంట్లు ప్రమాణాలను గాలికొదిలేసి అందులో పట్టుమని బేసిక్‌ ప్రమాణాలు కూడా పాటించడం లేదు. బీఐఎస్‌ మార్గదర్శకాల ప్రకారం ఫిల్టర్‌ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మొతాదు లీటరు నీటికి 100–150 మి.గ్రా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నిబంధన పాటించడం లేదు. లీటరు నీటిలో క్యాల్షియం 75 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 30 మిల్లీ గ్రాములు ఉండాలి. అయితే ఇక్కడి ప్లాంట్లలో వివిధ రసాయనాలు కలిపి ఇచ్చేస్తున్నారు. ఫ్లోరైడ్‌ మోతాదు ఒక మిల్లి గ్రామ్‌ మించకూడదు. ఐరన్‌మోతాదు 0.3 మి.గ్రా ఉండాలి.
  
నిద్రమత్తులో అధికారులు
వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, పుడ్‌ సేఫ్టీ అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అనధికారికంగా ప్లాంట్‌ నిర్వాహకులు యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక ఆహార కల్తీ నిరోధకశాఖలో ఐదుగురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా నెల క్రితం ట్రైనింగ్‌కు వెళ్లారు. ఇక అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.  

రూ. కోట్లలో వ్యాపారం
తాగునీటి వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో దాదాపుగా 43 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో సగం మంది మినరల్‌ వాటర్‌కు అలవాటు పడ్డారు. బిందె రూ 6 నుంచి 10, క్యాన్‌ రూ 20తో వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ రూ కోటికిపైగా జలవ్యాపారం జరుగుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, మిగితా 11 మునిసిపాలిటీల్లో నీరు పూర్తీ స్థాయిలో సరఫరా చేయడం లేదు. కేటాయించిన ఎంఎల్‌డీ కంటే తక్కువే పదుల సంఖ్యలో మునిసిపాలిటీలకు నీరు సరఫరా అవుతోంది. అసలే వేసవికాలం కావడంతో నీరు సరిగా వస్తుందో లేదోనని ముందస్తుగా ప్రజలు నీటిని కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర, రాయదుర్గం, కదిరి తదితర ప్రాంతాల్లోని లక్షలాది మంది మినరల్‌ గరళాన్ని తాగుతున్నారు. 

ఇన్‌స్పెక్టర్ల కొరత ఉంది  
అనధికారికంగా వాటర్‌ ప్లాంట్‌ నిర్వహించే వారిపై ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లే కేసులు పెట్టాలి. ప్రస్తుతం ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నారు. అయినా నగరంలోని చాలా ప్లాంట్లపై కేసులు నమోదు చేసి, ఫైన్లు వేశాం.            
-నాగేశ్వరరావు, పుడ్,సేఫ్టీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ 

రోగాలు వస్తున్నాయి 
గతంలో మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేసిన వాటర్‌ప్లాంట్లను సైతం ఇప్పుడు నడుపుతున్నారు. వాళ్లు సరఫరా చేసే మినరల్‌వాటర్‌ ఉప్పునీళ్ల మాదిరి ఉంటున్నాయి. అవి తాగినవారు గొంతు సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. 
-బాబ్జాన్, విద్యార్థి, కదిరి 

దుష్పరిణామాలు తప్పవు
ప్రమాణాలు లేని నీటిని తీసుకోవడం ద్వారా దుష్పరిణామాలు తప్పదు. నీటిలో రుచి కోసం రసాయనాలు కలపడం ద్వారా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కండరాలు, కీళ్ల నొప్పులు, యముకల్లో పటుత్వం కోల్పోయే అవకాశం ఉంది. బీఐఎస్, ఐఎస్‌ఓ సర్టిఫైడ్‌ చేసిన నీటిని తీసుకోవాలి.  
-డాక్టర్‌ కృష్ణకాంత్‌రెడ్డి, న్యూరాలజిస్టు, సర్వజనాస్పత్రి 

శుద్ధి జలాన్ని అందిస్తున్నాం  
బీఐఎస్‌ ప్రమాణాలతో ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నాం. కెమెస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి పరీక్షలు చేసి ప్రజలకు నీరందిస్తున్నాం. జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా వాటర్‌ ప్లాంట్లు నడుస్తున్నాయి. గతంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ అధికారులు తనిఖీ చేసి అనధికార ప్లాంట్లను గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్వాహకులపై ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజలు నీటిని కొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని తీసుకోవాలి.  
-పురుషోత్తంరెడ్డి, లెజెండ్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులు 

విధిలేక కొంటున్నాం
మినరల్‌ వాటర్‌ పేరుతో ఆటోల్లో, వాటర్‌ ప్లాంట్‌లలో ఒక్కో క్యాన్‌కు రూ.10 నుండి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఆ నీరు ఏ మాత్రం బాగుండటం లేదు. గత్యంతరం లేక ఆ నీటిని తాగుతున్నాం.  అధికారులు స్పందించి నాణ్యమైన నీటిని అందించేలా ప్రతి వాటర్‌ ప్లాంటూ ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలి. 
-మహేష్, ధర్మవరం 

మరిన్ని వార్తలు