నేడు ఆంధ్రా బ్యాంక్‌ చివరి వ్యవస్థాపక దినోత్సవం

28 Nov, 2019 05:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రా బ్యాంకుకి నవంబర్‌ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్‌ బ్యాంకుతో కలిపి యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్‌ 20న నమోదు చేయించారు.

అదే సంవత్సరం నవంబర్‌ 28న బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో గురువారం జరిగే ఆంధ్రా బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందని బ్యాంక్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్‌ ఎండీ, సీఈవో జె.పకీర్‌సామితోపాటు, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళి అర్పించారు. 

మరిన్ని వార్తలు