ఏపీ సర్కార్తో కలసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం
ఏయూలో వైస్చాన్స్లర్లు, ఇస్రో శాస్త్రవేత్తల భేటీ
విప్లవాత్మక మార్పులకు నాంది: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: రాష్ర్ట ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఇస్రో ముందుకొచ్చింది. ముఖ్యంగా నావిగేషన్, సమాచార మార్పిడి, భూ పరిశీలన తదితర అంశాలపై ఏపీ సర్కార్కు అవసరమైన సహకారం అందించేందుకు అంగీకరించింది. ఇస్రో వద్ద ఉన్న పిడుగుపాటును ముందుగా పసిగట్టే పరిజ్ఞానంతో పాటు మూడురకాల ఫోర్కాస్టింగ్ టెక్నాలజీలను కూడా యూనివర్సిటీ ల ద్వారా అమలు చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎ.ఎస్.కిరణ్కుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ సర్కార్ ఎంవోయూ కుదుర్చుకుంది. సోమవారం ఏయూ ఈసీ హాలులో ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, వర్సిటీల ఉపకులపతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ ఒప్పందంపై ఇస్రో, రాష్ర్ట ప్రభుత్వం సంతకాలు చేశాయి.
గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వంతో ఇస్రో పనిచేయాలి: చంద్రబాబు
ఇస్రో, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.పట్టణీకరణ, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఇస్రోను కోరారు.
చంద్రయాన్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి: ఇస్రో చైర్మన్
తుపానులు, సునామీలే కాదు.. ప్రతి విపత్తును 48 గంటలు ముందుగానే పసిగట్టే పరిజ్ఞానాన్ని ఇస్రో అభివృద్ధి చేసిందని చైర్మన్ డాక్టర్ ఎ.ఎస్.కిరణ్కుమార్ తెలిపారు. జియోగ్రాఫికల్, అండర్ వాటర్, స్పేస్టెక్నాలజీ సమాచారాన్ని కూడా ఇస్రో ఇవ్వగలదన్నారు. ఇప్పటివరకు 38 శాటిలైట్స్ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టగా, ఈ ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 8 శాటిలైట్స్ను నింగికి పంపామని గుర్తుచేశారు. ఎప్పుడు వర్షం పడుతుంది.. అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచంలో ఇండియా నంబర్వన్ స్థానం వైపు దూసుకెళ్తుందని చెప్పారు. చంద్రయాన్ ప్రాజెక్టు మరో రెండేళ్లలో పూర్తి కానుందని, చంద్రునిపై నీరుందని కనుగొనడంలో చంద్రయాన్-1 ఎంతగానో ఉపయోగపడిందన్నారు.
గిరిజనులకు ప్రతినెలా కిలో కందిపప్పు: సీఎం
రాష్ట్రంలోని ఆరు లక్షల గిరిజన కుటుంబాలకు ప్రతి నెలా కేజీ చొప్పున ఏడాది పాటు కందిపప్పును ఉచితంగా అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన కలెక్టరేట్లో సమీక్ష అనంతరం రాత్రి విలేకరులతో మాట్లాడారు. వచ్చే నవంబర్ 1 నుంచి కందిపప్పు అందిస్తామని, ఇందుకు రూ. 56 కోట్లు ఖర్చవుతుందన్నారు.