ప్రజలు పట్టించుకోవటం లేదు : గౌతం సవాంగ్‌

5 Apr, 2020 12:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ, గుంటూరు : ఆంధ్రా లయోలా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియోషన్స్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి గుడ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆదివారం విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్‌లో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ డీజీపీ గౌతం సవాంగ్, విజయవాడ సీపీ ద్వారాక తిరుమలరావు పలువరు పోలీసులకు గడ్లను పంపిణీ చేశారు. విజయవాడ, గుంటూరులోని 4 వేల మంది పోలీసు సిబ్బందికి ప్రతిరోజు 4 వేల గుడ్లు పంపిణీ చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీస్ సిబ్బంది 24 గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రజల్ని ఇంటి నుండి బయటకు రావద్దని సూచించినా వారు పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బయటకు వచ్చే వారికి తమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపటం జరుగుతుందని చెప్పారు. ఇక కేవలం 9 రోజులు లాక్‌డౌన్ పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చన్నారు. ఈ సమయం చాలా కీలకమని, ప్రజలందరూ తప్పకుండా లాక్‌డౌన్‌ పాటించాలని కోరారు. పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంధ్రా లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు.. సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు ‍ గుడ్లు పంచటం సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు