14 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు
20 బిల్లులపై సుధీర్ఘ చర్చ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 14 రోజులపాటు జరిగిన సమావేశాల్లో 20 కీలక బిల్లులపై సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. మంగళవారం వైస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రసంగం అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. పేద ప్రజల సంక్షేమమే ప్రధానంగా సాగిన అసెంబ్లీ ఈ సమావేశాలు ఎంతో చారిత్రాత్మకమైనవని అన్నారు. సమావేశాల్లో బిల్లులపై సభ్యులంతా సుధీర్ఘంగా చర్చించడం శుభపరిణామం అన్నారు.
ఎలాంటి ఆటంకాలు కలగకుండా సభను విజయవంతంగా నడిపించిన సభా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్పీకర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరుగుతోన్న తొలి సమావేశాలు కావడంతో ప్రజలంతా ఎంతో ఆసక్తిగా సమావేశాలను తిలకించిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ రూపొందించిన బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. పలు బిల్లులపై చర్చకు ప్రతిపక్షం నిరాకరిస్తూ.. వాకౌట్ చేసినప్పటికీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాలను కొనసాగించారు.