సాక్షి, అమరావతి: ఇటీవల మరణించిన మాజీ ఎమ్యెల్యేలు ఎం. సంజీవరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, బి.సుబ్బారెడ్డిలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి తమ్మినేని సీతారాం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప సూచకంగా సభ్యులంతా తమ స్థానాల్లో లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై తీర్మానం చర్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.
శాసనసభలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు. విభజన తర్వాత అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ, శాసనమండలిలో తీర్మానం చేయనున్నారు. ఇది ముగిశాక ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన చేస్తారు. విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు.