సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ్యులంతా చర్చించిన అనంతరం ఈరోజే బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీనితో పాటు పలు కీలక బిల్లుపై నేడు సభలో చర్చ జరుగనుంది. ముఖ్యంగా విద్యారంగంలో కీలకమైన సంస్కరణలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయనుంది. దీనిపై సంబంధిత మంత్రి సభలో మాట్లాడనున్నారు. అలాగే రెగ్యూలేటరీ కమిషన్ల బిల్లు కూడా నేడు సభ ముందుకు రానుంది. అనంతరం భూముల టైటిలింగ్ బిల్లును రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ సుధీర్ఘంగా చర్చించనుంది.