16 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

12 Jun, 2020 05:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 16న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయసభలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సచివాలయ కార్యదర్శి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. అందుకే అసెంబ్లీ, కౌన్సిల్‌ సభ్యులు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు శాసనసభలోనే సమావేశమవడం రివాజు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు సభల సభ్యులు ఒకే ప్రాంగణంలో సమావేశమైతే భౌతిక దూరం పాటించడం వీలు కాదు. అందువల్ల కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీలు మండలిలోనూ, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనూ సమావేశమయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

మరిన్ని వార్తలు