ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

11 Jun, 2020 14:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు
నవరత్నాలు అమల్లో భాగంగా వైఎస్సార్‌ చేయూత
వైఎస్సార్‌ చేయూత పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేల ఆర్థిక సహాయం అందనుంది. ఏడాదికి రూ. 18,142,81ల చొప్పున నాలుగేళ్ళ పాటు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆగస్టు 12న ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ పథకానికి 24 నుంచి 26 లక్షలమంది లబ్ధిదారులు ఉంటారని అంచనా.

‘జగనన్న తోడు’
ఈ పథకం కింద చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందించనుంది. ఇందులో భాగంగా ఏడాదికి దాదాపు రూ. 56 కోట్లు వడ్డీని భరించనుంది. చిరువ్యాపారులు, తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేవాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది. దాదాపు 9 లక్షలమందికిపైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ,  వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్
ఇప్పుడిస్తున్న దానికంటే.. తల్లులు, చిన్నారులకు మరింత మేలు చేసే విధంగా అదనపు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇందులో భాగంగా 77 మండలాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన చోట్ల వైఎస్సార్‌ సంపూర్ణ పోషణను అమలు చేయనుంది. ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం విస్తృతంగా అమలు చేయనున్న ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గర్భవతులు, తల్లులు, పిల్లల పౌష్టికాహారం కోసం 1863.11 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేయనుంది. కాగా 2018–19లో  చేసిన ఖర్చు రూ. 762 కోట్లు ఖర్చు చేయగా.. 2019–20లో రూ. 1076 కోట్లు వెచ్చించారు.

ఐదేళ్ల పాటు నివాసం ఉన్న తర్వాతే
ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు చేర్పులు ప్రతిపాదించారు. ఇళ్లు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునేలా నిబంధనలు విధించారు. 

గ్రేహౌండ్స్‌ శిక్షణా స్థలంకోసం 385 ఎకరాలు కేటాయింపు
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్‌ శిక్షణా స్థలంకోసం 385 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

బిల్డ్‌ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాల అమ్మకానికి కేబినెట్‌ ఓకే

  • విశాఖపట్నంలో 7, గుంటూరులో 4 స్థలాల విక్రయానికి అంగీకరించిన కేబినెట్‌
  • అలాగే గుంటూరులో 1, విశాఖలో 3 చోట్ల గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ ద్వారా అభివృద్ధికి రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం
  • డెవలప్‌ చేసిన తర్వాత వీటిని ఇ–వేలం ద్వారా విక్రయించనున్న ప్రభుత్వం
  • గుంటూరులో ఒక స్థలం అభివృద్ధి తాత్కాలికంగా నిలుపుదల
  • ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదమద్ర
  • విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
  • జేఎన్‌టీయూ కాకినాడ కింద ఏర్పాటు రూ. 153.853 కోట్ల ఖర్చు
  • ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
  • తిరుపతిలో ఏర్పాటుకు సూత్రప్రాయ నిర్ణయం

ఇక విద్యార్థుల తల్లుల చేతికే ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు

  • జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బును నేరుగా తల్లుల అక్కౌంట్లోకి పంపనున్న ప్రభుత్వం
  • ప్రతి త్రైమాసికం పూర్తికాగానే ఫీజురియంబర్స్‌మెంట్‌ డబ్బును తల్లుల ఖాతాల్లోకి వేయనున్న ప్రభుత్వం
  • కాలేజీల్లో వసతులు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న చదువులపై తల్లిదండ్రుల సమీక్ష, పరిశీలనకు ఈ విధానం ఉపకరిస్తు‍ందన్న ప్రభుత్వం
  • నిర్ణయానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

  • గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఏలూరు, ఒంగోలు, తిరుపతిల్లో మరో 144 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌  ఓకే
  • ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను మెరుగుపరచడానికి దృష్టిపెట్టిన ప్రభుత్వం

పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్
రైతులకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రైతులకు ఉచిత విద్యుత్, పగటిపూట కరెంటు సరఫరా స్థిరీకరణకు ఈ ప్రాజెక్టును రూపొందించారు.

పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి రూ. 405 కోట్ల ఆదా

  • కాంట్రాక్టు అప్పగించేందుకు హైకోర్టు ముందు జాయింట్‌ మెమోరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ ఫైల్‌ చేయడానికి కేబినెట్‌ ఓకే
  • పోలవరం హైడ్రోప్రాజెక్టు ఐబీఎం వాల్యూ రూ.3,216 కోట్లు. 
  • 12.6 శాతం లెస్‌తో రూ. 2811కోట్లకు బిడ్‌ దక్కించుకున్న మెగా సంస్థ

ఏపీ అవుట్‌ సోర్సింగ్‌ సర్వీస్‌కార్పొరేషన్‌ కోసం 55 పోస్టులను భర్తీచేసేందుకు కేబినెట్‌ ఆమోదం

  • దళారీలు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల్లో అవినీతి లేకుండా చూడటానికి చర్యలు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, మొత్తం నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
  • మధ్యలో కమీషన్లు లాంటివి లేకుండా నేరుగా బ్యాంకుఖాతాలకే సకాలానికి జీతాలు జమ
  • ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి బెనిఫిట్స్‌ అందించేలా చూడ్డానికే అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు. 

రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్‌ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం

  • ఫేజ్‌ –1 కింద 36 నెలల్లో రూ. 3,736 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక, 802 ఎకరాల్లో తొలిదశ
  • రూ.200 కోట్ల నిధులు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం, రూ.2079 కోట్ల మేర రుణాలు.

గండికోట నిర్వాసితులను తరలించేందుకు రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం

  • వెలిగొండ ప్రాజక్టులో ఆర్‌ అండ్‌ ఆర్‌కు రూ. 1301.56 కోట్లు
  • తీగలేరు, ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ భూసేకరణకోసం రూ.110 కోట్లు
  • మొత్తంగా రూ. 1411.56 కోట్లు 
  • వీటి అమలుకు కేబినెట్‌ ఆమోదం

పన్ను ఎగవేతలపై నిశిత దృష్టి

  • సమర్థవంతమైన చర్యలకు కొత్త విభాగం ఏర్పాటు 
  • ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఆర్థిక శాఖ పరిధిలో ఈ విభాగం ఉంటుంది
  • ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌కు 55 పోస్టులు

మరింత లోతుగా దర్యాప్తు

  • ఏపీ ఫైబర్‌ నెట్, చంద్రన్నకానుక, రంజాన్‌ తోఫా పథకాల్లో జరిగిన అక్రమాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన రెండో నివేదికకు ఆమోదం
  • ప్రాథమిక ఆధారాలు ఉన్నందున లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరో తేల్చాలన్న కేబినెట్‌.. తదుపరి దర్యాప్తునకు ఆదేశం

ఇంటిగ్రేటెడ్‌ రెన్యువల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం

  • కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఏర్పాటుకానున్న ప్రాజెక్టు
  • 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అనుమతి, అప్పుడు ప్రభుత్వ భూమికి ఎకరాకు రూ.2.5 లక్షలు
  • ఇప్పుడు అదే సంస్థ, అదే ప్రాజెక్టు.. ఎకరాకు రెట్టింపు చెల్లించడానికి సిద్ధం
  • ఎకరాకు రూ. 5లక్షలు చొప్పున ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధం
  • ఇది కాక ప్రతి మెగావాట్‌కు ప్రతి ఏటా గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఛార్జ్‌ కింద లక్ష రూపాయలు చెల్లింపునకు కంపెనీ అంగీకారం, ఏడాదికి రూ.32కోట్లు ఆదాయం
  • 25 ఏళ్ల తర్వాత ప్రతి మెగావాట్‌కు 2 లక్షల రూపాయలు చెల్లింపునకు అంగీకారం
  • ప్రాజెక్టులో భాగంగా 550 మెగావాట్లు విండ్‌ పవర్, 1200 మెగావాట్ల హైడ్రో, 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తి

ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం!

  • బోగాపురం ఎయిర్‌పోర్టులో లో 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి 
  • 2700 నుంచి 2200 ఎకరాలకు ఎయిర్‌పోర్టు కుదింపు
  • కుదింపు స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి కంపెనీ అంగీకారం
  • తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు 
  • రూ. 3కోట్లు ధర వేసుకున్నా... ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం
మరిన్ని వార్తలు