ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

15 Jul, 2020 16:07 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన  సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేబినెట్‌.. దేశ చరిత్రలోనే తొలిసారి 9,712 వైద్యుల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా అదనంగా 8.21 లక్షల మందికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 6163.59 కోట్లు కేటాయించి.. 45-60 ఏళ్ల మధ్య మహిళలకు నాలుగు విడతల్లో రూ. 75 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ అగ్రికల్చరల్‌ ల్యాండ్ యాక్ట్‌ 2006 సవరణ, ప్రత్యేక ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.(ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ)

ఏపీ కేబినెట్ నిర్ణయాలు

  • పాఠశాలల్లో నాడు -నేడు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలు, కాలేజీలు, హాస్టళ్లను నాడు -నేడు కింద అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్‌లో 28 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 
  • పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు చేరువగా ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటుకై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ కమిటీలో సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ అధ్యయనం చేయనుంది. 
  • సంప్రదాయేతర కరెంట్ ఉత్పత్తి, ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ విధానం 2020కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రైతులకు పగటిపూట ఉచిత కరెంట్ ఇచ్చేలా ప్రాజెక్టులు రూపొందించనుంది. రాయలసీమ ప్రాజెక్ట్‌ల సామర్థ్యం పెంపు, కాలువల విస్తరణ పనుల కోసం ఎస్‌పీవీ
  • ఏపీ ఆర్‌ఎస్‌డీఎమ్‌పీసీఎల్‌ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా కేపిటల్ ఔట్‌ లే రూ.40 వేల కోట్లు, గండికోట ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం 145.94 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపింది.
  • గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు ఆమోదం
మరిన్ని వార్తలు