సాక్షి, విజయవాడ : ఏపీ కేడర్కు కేంద్ర హోంశాఖ కేటాయించిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. 2018 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వారంతా నేషనల్ పోలీస్ అకాడమి ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణకాంత్, వీఎస్ మణికంఠ, కృష్ణకాంత్ పాటిల్ (తెలంగాణ), పి.జగదీష్ (కర్ణాటక), తుషార్ దుడి (రాజస్థాన్)లను కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ఏపీ కేడర్కు కేటాయించింది. వారికి బాధ్యతలు అప్పగించేలా ఏపీ పోలీస్ అకాడమి డైరెక్టర్ సంజయ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో వారంతా డీజీపీ గౌతమ్ సవాంగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ట్రైనింగ్ కిట్లు అందించిన డీజీపీ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మంచి పోలీసు అధికారులుగా ప్రజల మన్ననలు పొందాలని అభిలషించారు. కొత్త ఐపీఎస్ అధికారులకు సీఐడీ, ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్, విజిలెన్స్, ఏసీబీ, గ్రేహౌండ్స్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సంజయ్ను సవాంగ్ ఆదేశించారు.