కిరణ్ చూపు.. బీజేపీ వైపు

17 Jun, 2014 13:37 IST|Sakshi
కిరణ్ చూపు.. బీజేపీ వైపు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెంటికి చెడ్డ రేవడిలా తయారైన మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాజీ సీఎం కిరణ్ ప్రయత్నాలను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం, ఇప్పట్లో పుంజుకోవడం కష్టమేనన్న భావనలో ఉన్న కిరణ్ చూపు ప్రస్తుతం బీజేపీపై ఉందని ఆయన సన్నిహితుడొకరు మీడియాకు వెల్లడించారు. 
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్య గళాన్ని బలంగా వినిపించేందుకు జై సమైక్యాంధ్ర పార్టీని ప్రారంభించిన పార్టీకి ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, తనవెంట ఉంటారనుకున్న నేతలందరూ చడీచప్పుడు కాకుండా హ్యాండ్ ఇవ్వడంతో ఒంటరైన కిరణ్ చాలా రోజుల తర్వాత ఇటీవల జన జీవన స్రవంతిలో కలిశారు. అయితే రాష్ట్ర విభజనలో భాగమైన బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేని కిరణ్ ను సన్నిహితులు, సలహాదారులు, తన సోదరులు ఒప్పించినట్టు రాజకీయవర్గాల్లోనూ, మీడియాలోనూ ఊహాగానాలు జోరుందుకున్నాయి. 
 
కిరణ్ ను బీజేపీలో చేర్చేందుకు ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితులైన రెండు గ్రూపులు తమ ప్రయత్నాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవర్గం, బెంగళూరులోని బీజేపీకి చెందిన ఓ నేత కిరణ్ ను బీజేపీలోకి చేర్పించే ఈ బృహత్తర కార్యాన్ని తమ భుజాన వేసుకున్నట్టు సమాచారం. 
మరిన్ని వార్తలు