అంతర్రాష్ట్ర సర్వీసులు షురూ!

5 Jun, 2020 04:51 IST|Sakshi

తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలకు సీఎస్‌ లేఖ

కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 

► తెలంగాణ నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో పెద్ద సంఖ్యలో వస్తున్న వారికి రాష్ట్ర సరిహద్దులో తనిఖీలు, స్క్రీనింగ్‌ చేసి, వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ వివరాల సేకరణ ప్రస్తుతం సమస్యగా మారింది.

► ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వారి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

► లాక్‌డౌన్‌–4 నిబంధనల మినహాయింపు తర్వాత తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం బస్సులు తిప్పడానికి అప్పట్లో ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయత్నించగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు అంతర్రాష్ట్ర ప్రయాణికులను తెలంగాణ అనుమతిస్తున్నా.. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు.

► కాగా, తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ప్రభుత్వాలకు ఏపీ లేఖలు రాసింది. 

► ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. (ఏపీఎస్‌ఆర్టీసీ మరో నిర్ణయం)

మరిన్ని వార్తలు