నేటి నుంచి ఇసుక రవాణా బంద్‌..!

11 Jun, 2019 17:05 IST|Sakshi

నూతన ఇసుక విధానం తేనున్న ప్రభుత్వం

అప్పటి వరకు ఇసుక రవాణా బంద్‌ చేస్తూ నిర్ణయం

స్మగ్లింగ్‌ ఆపకపోతే పీడీయాక్టు కింద కేసులు

వెల్లడించిన గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, అమరావతి : ఇకపై రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు ఉండవని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా ఇసుక దోపిడీ సాగిందని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని, టీడీపీ నేతలు ఇసుకను దోచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. అందుకే టీడీపీ అధోగతి పాలైందని అన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఇసుక రవాణా నిలిపేయాలని ఆదేశించాం. కొత్త ఇసుక విధానం వచ్చేంత వరకు ఇసుక రవాణా చేయడానికి వీల్లేదు. మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇసుక రవాణా గురించి కొత్త పాలసీ తీసుకురావాలని ఆదేశాలు జారీచేశారు. జూలై 1 లోపు నూతన ఇసుక పాలసీ తీసుకోస్తాం. ఇసుక స్మగ్లింగ్‌కి ఈరోజు నుంచి పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆదేశాలు జారీచేశాం. స్మగ్లింగ్ ఆపకపోతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం. గతంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోని టీడీపీ నేతలు కొట్టారు. సాండ్‌ స్మగ్లింగ్‌ జరిగితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా లక్షల లారీల ఇసుక దోచేశారు. ఇసుక ర్యాంపు 202 నుంచి 116 కు తగ్గిపోయాయి.’ అన్నారు.

మరిన్ని వార్తలు