‘ఆశ’ నెరవేరింది

11 Aug, 2019 13:33 IST|Sakshi

సాక్షి, కాశినాయన(కడప) : ఆశా కార్యకర్తలకు ఇక నుంచి నెలకు రూ.10 వేలు వేతనం లభించనుంది. ప్రభుత్వం ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 2100 మంది ఆశా కార్యకర్తలకు ప్రయోజనం కలగనుంది. ఉత్తర్వులు వెలువడటంతో వారంతా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి నెలకు గౌరవ వేతనంగా రూ.3 వేలు చెల్లించేవారు. అదనంగా చేసిన సేవలకు కొంత మొత్తం ఇన్సెంటివ్‌గా చెల్లించేవారు. నెలకు రూ.6 వేల వరకు వచ్చేది. గర్భవతి వివరాల నమోదు మొదలుకుని సకాలంలో టీకాలు ఇప్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రసవానికి తీసుకురావడం జరిగింది.

బిడ్డకు అన్ని టీకాలు వేయించడం వంటి పనుల్లో సాయం అందించినందుకు  వైద్య, ఆరోగ్యశాఖ విభాగం అధికారులు వీరికి నెలకుఇన్సెంటివ్‌ చెల్లించేది. ప్రతి నెల వారికి ఇది ఓ ప్రహసనంగా ఉండేది. క్షేత్రస్థాయిలో ఎంపీహెచ్‌ఏ నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు జిల్లా కార్యాలయానికి సేవలకు సంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదిక పంపిస్తేనే ప్రోత్సాహక నగదు ముట్టేది.  సరైన రీతిలో కొందరికి ఇన్సెంటివ్‌ జమ అయ్యేది కాదు. ఇలాంటి ఆశా కార్యకర్తలకు ఇకపై ఇబ్బందులు ఇక తొలగనున్నాయి. రూ.10 వేల గౌరవ వేతనం అందనుంది. పెంచిన ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం  ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే సెప్టెంబర్‌ 1వ తేదీన కొత్త వేతానలు రూ.10 వేలు జమ అవుతాయి. 

ఎంతో ఆనందంగా ఉంది :
ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిసి చాలా ఆనంద పడుతున్నాం. ఇది మా కుటుంబాలకు తీపి కబురే. అయితే మాకు ఆరు నెలల ప్రోత్సాహక డబ్బులు అందాలి. వాటి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. 
కె.విజయలక్ష్మి, ఆశావర్కర్‌ 

ఇన్నాళ్లకు గుర్తింపు వచ్చింది :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో విధుల్లో చేరాం. ఇన్నాళ్లు సేవచేసినందుకు మేలు జరిగింది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో మా కష్టాలు తొలగిపోయాయి. నెలకు రూ.10 వేలు ఇచ్చేలా ఆదేశాలు వచ్చాయని మా డాక్టర్లు చెప్పారు. సంతోషంగా ఉంది. 

మరిన్ని వార్తలు