ఏపీలో 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌

17 Mar, 2017 08:47 IST|Sakshi

నెల్లూరు, కర్నూలు, కడప : ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. వైఎస్‌ఆర్‌, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వైఎస్‌ఆర్‌జిల్లా
841మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కడప, జమ్మలమడుగు, రాజంపేటలో పోలింగ్‌ జరుగుతోంది. ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి...జమ్మలమడుగులో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఆయన పులివెందుల చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి  వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా తొలిసారిగా డ్రోన్‌ కెమెరాలతో పోలింగ్‌ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 4వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ  కడప పోలింగ్‌ కేంద్రాన్ని  తనిఖీ చేశారు.

నెల్లూరు:
ఈ ఎన్నికల్లో 852మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. నెల్లూరు, నాయుడుపేట, ఆత్మకూరు, గూడురు, కావలిలో పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆనం విజయ్‌కుమార్‌ బరిలో ఉన్నారు.

కర్నూలు:
జిల్లాలో 1083 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో పోలింగ్‌ జరుగుతుంది. గౌరు వెంకటరెడ్డి...వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి పోటీ చేసున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు