ఏపీ లోక్‌సభ అప్‌డేట్స్‌: ఫ్యాన్‌ జోరు

23 May, 2019 08:04 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. జనసేన పార్టీ ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.
 

► కాకినాడ ఎంపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌పై  26,762 ఓట్ల మెజారిటీతో వంగా గీత గెలుపొందారు.

► విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ 44 వేల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుపై విజయం సాధించారు.

నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు 35 వేల ఓట్ల మెజారిటీతో తన సమీప టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు.

► ఏలూరు పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ లక్షా 62 వేల 143 ఓట్ల తేడాతో గెలుపొందారు.

► కాకినాడ పార్లమెంటు స్థానంలో 12 వ రౌండ్‌ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత, తన సమీప టీడీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై 18 వేల ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు.

► ఏలూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ లక్షా 25 వేల రికార్డు స్థాయి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

►  విజయనగరం పార్లమెంటు స్థానంలో 16వ రౌండ్‌ పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ తన సమీప టీడీపీ అభ్యర్థి పూసపాటి అశోక్‌ గజపతి రాజుపై 46,993 ఓట్ల మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు. 

► విజయనగరం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో ఉంది. 14 రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు 5 లక్షల 4 వేల 366 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పూసపాటి అశోక్‌ గజపతి రాజుకు 4 లక్షల 64 వేల 730 ఓట్లు పడ్డాయి. వైఎస్సార్‌సీపీ ఆధిక్యం 39 వేల 636.

► పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ 75 వేల మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు.

హిందూపురం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 40000 పైచిలుకు ఆధిక్యతతో కొనసాగుతున్నారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిపై  వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి రంగయ్య 50000 పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు.  

ఆదాలకు ఆధిక్యం
నెల్లూరు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి  4 రౌండ్ల తర్వాత 36313 ఓట్ల ఆధిక్యం లభించింది. రాజంపేట లోక్‌సభ స్థానం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి లక్షకుపైగా మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

► కృష్ణ జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి విజయం దిశగా పయస్తుండటంతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

 అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నరసాపురం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు, మచిలీపట్నం

 పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చుతుండటంతో టీడీపీ నాయకుడు, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు కౌంటింగ్‌ హాలునుంచి బయటకు వెళ్లిపోయారు.

► చిత్తూరు పార్లమెంట్‌ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప 57,687 ఓట్లతో ఆదిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి శివప్రసాద్‌ 43365 ఓట్లతో వెనుకంటజలో ఉన్నారు. ఇక తిరుపతి లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌ 3787 ఓట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ వెనుకంజలో ఉన్నారు.

 కేంద్ర మాజీమంత్రి, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి పూసపాటి అశోక్‌ గజపతిరాజు వెనుకంజలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెలాన్ల చంద్రశేఖర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అనకాపల్లి, ఏలూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, విజయనగరం స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. 

 అనంతపురంలో టీడీపీ అభ్యర్థి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌ వెనకంజలో ఉన్నారు. కడపలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, హిందూపురం లోక్‌సభ స్థానంలో గోరంట్ల మాధవ్‌ ఆధిక్యంలో ఉన్నారు.

ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజి వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల ఆందోళనకు దిగారు. టిఫిన్ లేదంటూ అంటూ కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఏజెంట్లు  ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఏజెంట్ నుండి 400 వసూలు చేసిన అధికారులు సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైంది. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘు రామకృష్ణం రాజు భీమవరం కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్ధానాలకు ఏలూరు, భీమవరంలలోని మూడు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇలా తెలుసుకోవచ్చు
ఎన్నికల సరళి, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను కౌంటింగ్‌ కేంద్రం వద్ద మైక్‌లో వెల్లడించడంతోపాటు మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్‌లోడ్‌ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఫలితాలను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.  https:// results. eci. gov. in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్‌ హెల్ప్‌ లైన్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా కూడా ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు