8.25 గంటల్లో పాక్ జలసంధిని ఈదిన తులసి చైతన్య
తిరువొత్తియూర్: తమిళనాడులోని రామనాథపురం సమీపంలో తలైమన్నార్–ధనుష్కోటి మధ్య ఉన్న పాక్ జలసంధిని ఆంధ్రప్రదేశ్కు చెందిన మోదుకూరి తులసి చైతన్య అనే పోలీసు 8 గంటల 25 నిమిషాల్లో ఈది ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు తలైమన్నార్ హార్బర్ నుంచి ఈదడం ప్రారంభించిన తులసి చైతన్య ఉదయం 9.25 గంటలకు ధనుష్కోటికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన గణాంకాల ప్రకారం అతి తక్కువ సమయంలో పాక్ జలసంధిని ఈదిన తొలివ్యక్తిగా చైతన్య రికార్డు సృష్టించారు.
ఈ సందర్భంగా చైతన్యను కుటుంబ సభ్యులు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఐజాక్ జయకుమార్, జాలర్లసంఘం అధ్యక్షుడు ఎన్కే బోస్ అభినందించారు. కాగా, ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు సహకరించిన తమిళనాడు, శ్రీలంక ప్రభుత్వాలకు, సముద్రంలో మార్గనిర్దేశం చేసిన కమాండర్ ఉన్నీకి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు