- రోడ్మ్యాప్లకు తుది మెరుగులు దిద్దుతున్న నేతలు
- 12న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా
- రేపు ఢిల్లీకి కిరణ్, బొత్స, దామోదర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై గత మూడేళ్లుగా నాన్చుతున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఎట్టకేలకు ఈ అంశంపై ‘తుది చర్చకు’ పార్టీ కోర్ కమిటీ సమావేశానికి తేదీ ఖరారు చేయటంతో రాష్ట్ర నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కోర్ కమిటీలో చర్చించటానికి రోడ్మ్యాప్లు రూపొందించే పనిలో నిమగ్నమైన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ఢిల్లీ రావలసిందిగా ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎవరికివారు తమదైన వాదనలతో రోడ్మ్యాప్లకు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
12న కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చ ఉండకపోవచ్చని తొలుత భావించిన ముఖ్యమంత్రి ఆ రోజు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ.. పరిస్థితులు మారడంతో తొలుత 12వ తేదీ ఉదయానికి కేబినెట్ భేటీ సమయాన్ని మార్చారు. అవసరమైతే 12వ తేదీ సాయంత్రం కోర్ కమిటీ భేటీ సమయానికి ఢిల్లీ చేరుకోవచ్చని ఆలోచించారు. కానీ ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని పూర్తిగా వాయిదా వేశారు. ముగ్గురు నేతలూ ఒక రోజు ముందుగానే అంటే గురువారం నాడే ఢిల్లీ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు విడివిడిగా రూపొందించిన రోడ్మ్యాప్ నివేదికలను ముందుగా దిగ్విజయ్సింగ్కు అందజేసే అవకాశాలున్నాయి.
పూర్తి రాజకీయ కోణంలో కేంద్రం కసరత్తు చేస్తున్నందున ఈ ముగ్గురు నేతల నివేదికలు కూడా అదే కోణంలో రూపొందించినట్లు సమాచారం. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్కు జరిగే లాభమెంత? ఎన్ని లోక్సభ స్థానాలను గెలుచుకోగలం? రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? వంటి అంశాలను డిప్యూటీ సీఎం సిద్ధం చేస్తున్న రోడ్మ్యాప్లో విడిగా పొందుపరుస్తున్నట్టు తెలిసింది. ఇదే కోణంలో రాష్ట్రాన్ని విభజించటం లేదా సమైక్యంగా ఉంచటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే పరిస్థితులు, లాభనష్టాలను బేరీజు వేస్తూ సీఎం, పీసీసీ చీఫ్లు నివేదికలు రూపొందించారు. ఈ విషయంలో ఇప్పటికే హైకమాండ్కు సీఎం ఒక నివేదిక అందజేయగా అందులో ఏ నిర్ణయం తీసుకున్నా ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధికారులు అందజేసిన గణాంకాలను ప్రధానంగా వివరించినట్లు చెప్తున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది తేల్చుకోలేక హైరానా పడుతున్న పార్టీ రాష్ట్ర నేతలు 12వ తేదీకి ముందుగానే ఢిల్లీ వెళ్లటానికి సిద్ధమవుతున్నారు.
ఎవరి రోడ్మ్యాప్ వారిదే...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తన నివేదికలో మరో ప్రత్యామ్నాయమే సూచించకూడదని డిప్యూటీ సీఎం ఇప్పటికే నిర్ణయించుకున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఇప్పటి వరకు తెలంగాణ లక్ష్యంగా ఉద్యమిస్తున్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుందని, ఒకవేళ విలీనం కాకపోతే టీఆర్ఎస్ను ఏ విధంగా బలహీనం చేయవచ్చనే అంశాలను కూడా అందులో పొందుపర్చినట్లు తెలిసింది. రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుంటే టీఆర్ఎస్, టీడీపీల్లోని తెలంగాణ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని దామోదర పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణకు కాంగ్రెస్ అనుకూల నిర్ణయం తీసుకోవటం వల్ల తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల జేఏసీ నాయకులంతా కాంగ్రెస్ పక్షాన నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒంటరి అయ్యే పరిస్థితి నెలకొందని అందులో పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స అందించే నివేదికలో ఎలాంటి అంశాలు పొందపరచనున్నారన్న విషయం బయటకు పొక్కకుండా ఆయన జాగ్రత్త పడుతున్నప్పటికీ ఇటీవలి కాలంలో బొత్స కొందరు నాయకులతో జరిపిన చర్చలు, వాటి సారాంశాన్నే రోడ్మ్యాప్లో పొందుపరుస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. బొత్స సత్యనారాయణ మంగళవారం తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నానని వెల్లడించారు. ఇంకోవైపు సీఎం కిరణ్ రూపొందించబోయే రోడ్మ్యాప్ కూడా కీలకం కాబోతోంది. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని పేర్కొంటూ అందుకు కొన్ని ఉదాహరణలను వివరించినట్లు సమాచారం. ప్రభుత్వ మనుగడ, కాంగ్రెస్ భవిష్యత్తు, ఉత్పన్నమయ్యే సాంకేతిక అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది.
తుది నిర్ణయం ఉంటుందా?
కోర్ కమిటీ సమావేశం తర్వాత తెలంగాణ అంశంపై ఏదో ఒక నిర్ణయం ఉంటుందా? ఎప్పటిలాగే కొత్త మెలిక పెట్టి వాయిదా వేస్తారా? ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీనిపైనే చర్చ సాగుతోంది. ఏదో ఒక నిర్ణయం ఉంటుందన్న విషయంలో కాంగ్రెస్కు చెందిన ముఖ్య నాయకులు సైతం విశ్వసించటం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెబుతూ తదనంతర ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు ప్రకటన చేయవచ్చనీ, ఆ ప్రకటన మేరకు నెల రోజుల్లోపు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో ఈ అంశంపై ప్రత్యేక భేటీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణ అంశంపై రోడ్మ్యాప్లు రూపొందించే బాధ్యతను రాష్ట్ర నేతలపై నెట్టినట్లే.. అసెంబ్లీలో తీర్మానం అంశం తెరమీదకు వచ్చే అవకాశాలున్నాయన్న మాట కూడా వినిపిస్తోంది.
ఇప్పటికే నిర్ణయమైపోయిందా?
సీఎం, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం రోడ్మ్యాప్లపై చర్చించిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్సింగ్ అధిష్టానం మాటలుగా పైకి చెప్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. పార్టీలో సర్వత్రా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అధిష్టానం రాజకీయంగా ఒక ఆలోచనతో ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో రూపొందిస్తున్న రోడ్మ్యాప్లన్నీ కాలయాపన కోసం పనికొస్తాయని అంటున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏడాది కాలం పాటు అధ్యయనం చేసి సమర్పించిన నివేదికతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎన్నో కోణాల్లో నివేదికలు అందజేశాయని, ఇప్పుడిచ్చే రోడ్మ్యాప్ల్లో కొత్తగా ఉండేదేమీ లేదని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
జానా నివాసంలో వార్ రూం భేటీ
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి నివాసంలో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణపై రూపొందిస్తున్న రోడ్మ్యాప్పై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి నివాసాన్ని వార్రూంగా మార్చుకున్న విషయం తెలిసిందే. తాజా సమావేశంలో ప్రధానంగా రాష్ట్రాన్ని విభజిస్తే నీటి వనరుల పంపిణీలో తలెత్తే విబేధాలపై దృష్టి సారించారు. అందుకోసం నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్.విద్యాసాగర్రావును ఈ సమావేశానికి పిలిపించుకుని అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నర్సారెడ్డి, ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.