ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం

31 Aug, 2018 18:09 IST|Sakshi

సెల్ టవర్‌కు ఉరేసుకున్న రాజమండ్రి యువకుడు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు ప్రాణ త్యాగానికి పాల్పడ్డాడు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) అనే యువకుడు ఆత్మార్పణ చేశాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్‌ వద్ద సెల్ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. సంఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. హైద్రాబాద్ అభివృద్ధి విషయంలో చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదా విషయంలో చూపించాలని ముఖ్యమంత్రికి సూచించాడు.

త్రినాథ్ రాసిన సూసైడ్‌ నోట్‌లో....
‘అయ్యా.. సీఎం గారు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మీరు చూపించిన శ్రద్ధ, ప్రత్యేక హోదా విషయంలో చూపించండి. అప్పుడే నా మరణానికి ఒక అర్ధం, మా అమ్మ నన్ను కన్నందుకు ఒక ప్రయోజనం, ప్లీజ్ సిట్. కేరళ  వరదల్లో ఉందని అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలని తమ సమయాన్ని ధన రూపంలోను, మాటల రూపంలో ఆదుకుంటున్నారు. ముఖ్యంగా మీడియా, సినీ ప్రముఖులు ముందుకొచ్చి సహాయాన్ని అడుగుతున్నారు. ఇది తప్పు అని అనడం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ వరద బాధితులు సార్ ఏపీ ప్రజలు. దయచేసి గుర్తించండి. ప్రత్యేక హోదా విషయంలో సినీ, రాజకీయ, పారిశ్రామివేతలు ఆదుకోవాలి. మాట తప్పినందుకు అమ్మా నన్ను క్షమించు. అమ్మను జాగ్రత్తగా చంటిపిల్లలా చూసుకోండి’

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
యువకుడు త్రినాథ్‌ మృతి పట్ల ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రాణత్యాగాలకు పాల్పడవద్దని కోరారు. పోరాటాల ద్వారా ప్రత్యేక హోదా సాధించుకుందామన్నారు.

మరిన్ని వార్తలు