దోపిడీ చేయడం మానండి

17 Dec, 2018 13:41 IST|Sakshi
వృద్ధురాలికి మాత్రలు అందజేస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు(సెంట్రల్‌): ‘మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. పనుల పేరుదో దోపిడీ చేయడం మానండి’ అని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నగరంలోని 42వ డివిజన్‌లో స్థానికులకు కార్తీక్‌ హార్ట్‌ సెంటర్‌ సహకారంతో ఎమ్మెల్యే సొంత నిధులతో రాజన్న గుండెభరోసా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. దీనిని అనిల్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో వివిధ పనుల పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. కాలువల్లో పూడిక తీయాలని, లేకుంటే వర్షాలు కురిస్తే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాలుగున్నరేళ్లుగా మొత్తుకుంటున్నా పట్టించుకోలేదన్నారు. మంత్రి నారాయణ ఇప్పటివరకు నగరాన్ని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదో చేస్తున్నట్లు అబూత కల్పనను సృష్టిస్తున్నారన్నారు. తుపాన్‌ వచ్చే రోజుల్లో హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు.

నగరంలో తవ్విన రోడ్లతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ ప్రొటోకాల్‌ కూడా పాటించకుండా మంత్రి నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్‌ నుంచి అన్ని వాడుకుంటున్న మంత్రి నారాయణ మేయర్‌ స్థానానికి గౌరవం కూడా ఇవ్వకపోవడం మంచిపద్ధతి కాదన్నారు. దోపిడీ వ్యవహారాలు మొత్తం త్వరలోనే బయటకు వస్తాయన్నారు. రాజన్న గుండెభరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకుంటున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. 271 మందికి డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ వైద్యపరీక్షలు నిర్వహించారని, అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇచ్చారన్నారు. ఎనిమిది మందికి బైపాస్‌సర్జరీలు, 97 మందికి యాంజియోగ్రామ్, 37 మందికి యాంజియోప్లాస్టీ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ ఇంతియాజ్, ఖాదర్‌బాషా, అలీం, దస్తగిరి, సందానీ, ఇలియాజ్, జలీల్, అబీద్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు