కేంద్రానికి ఏపీ సర్కార్‌ నోటీసులు

13 May, 2018 10:59 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం- కేంద్ర సర్కార్‌ల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. రాజధాని ప్రాంతంలో కేంద్ర సంస్థల ఏర్పాటులో ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, సంబంధిత భూములను తిరిగిచ్చేయాలంటూ సీఆర్‌డీఏ కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అమరావతిలో కేంద్రీయ విద్యాలయం, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, ఎఫ్‌సీఐ, పోస్టల్‌, పబ్లిక్‌ వర్క్స్‌ తదితర సంస్థలు ఏర్పాటుచేస్తామంటూ కేంద్రం భూములు తీసుకుంది. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. దీంతో తీసుకున్న భూముల్ని తిరిగిచ్చేయాలంటూ సీఆర్‌డీఏ అధికారులు కేంద్రంలోని ఆయా శాఖలకు నోటీసులు పంపారు.

‘‘భూములు తీసుకున్న మూడు నెలల్లోగా నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదు. అందుకే నోటీసులు ఇచ్చాం’’ అని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మీడియాతో చెప్పారు. తాజా  నోటీసులపై కేంద్రం స్పందించాల్సిఉంది. కాగా, కేంద్ర సంస్థల ఏర్పాటుపై నాలుగేళ్లు మిన్నకుండిన చంద్రబాబు.. ఇప్పుడే మేల్కొన్నట్లు హడావిడి చేయడం నాటకంలో భాగమేనని భూములిచ్చిన రైతులు అంటున్నారు.
(తప్పక చదవండి: అమరావతిపై కేంద్ర సంస్థల అనాసక్తి)

>
మరిన్ని వార్తలు