హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డిపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జానారెడ్డి ఆస్తులపై విచారణ జరపాలని ఫోరమ్ ఎగైనెస్ట్ ఫైనాన్సియల్ క్రైమ్స్ సంస్థ శుక్రవారం ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ సంస్థ ఇవే ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎక్కడా ఫిర్యాదు చేయకుండా నేరుగా తమనే ఆశ్రయించడం సరికాదని హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది.
హైకోర్టు సూచన మేరకు పిటిషనర్ వీవీరావు వివిధ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలను ఆశ్రయించారు. అయితే ఎక్కడ కూడా సరైన స్పందన రాలేదని అన్ని ఆధారాలతో పిటిషనర్ హైకోర్టును మళ్లీ పిటిషన్ వేశారు. జెకెఏఆర్ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీ పెట్టి పది రూపాయల వాటాను 500 రూపాయలకు అమ్మారని పిటిషనర్ తన ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్ర మంత్రి దానం నాగేందర్కు కూడా జానారెడ్డి కంపెనీల్లో వాటాలున్నాయని పిటిషనర్ ఆరోపించారు.