మరో థర్మల్ పవర్

27 Mar, 2015 03:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాకు మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు రానుంది. ఇప్పటికే పరవాడలో రెండు వేల మెగావాట్ల సామర్థ్యం కల ప్రాజెక్టు నడుస్తున్న నేపథ్యంలో మరో ప్రాజెక్టు దిశగా అడుగులు పడుతున్నాయి. అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల మధ్య నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశను దాటగలిగింది. అవసరమైన అనుమతులు పొందడంలో ముందడుగు వేసింది. తొలుత అభ్యంతరం వ్యక్తం చేసిన పర్యావరణ శాఖ కూడా చివరికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పచ్చజెండా ఊపింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ తర్వాత నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ భారీ పవర్‌ప్లాంటు పూర్తయితే 4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.

దానిలో అధిక భాగం రాష్ట్ర ప్రయోజనాలకే వినియోగించనున్నారు. జిల్లాలోని అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల మధ్య ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను కేంద్రం రెండు రోజుల క్రితం మంజూరు చేసింది. మే నాటికి పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించిన పర్యావరణ ప్రభావిత నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం, సీలేరు, నాగార్జుల సాగర్ జల విద్యుత్ కేంద్రాలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.

వాటిలో సీలేరు మినహా మిగతా రెండిటి విషయంలోనూ తెలంగాణతో వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో ఎన్టీపీసీ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. ఎన్టీపీసీ భారీ ప్రాజెక్టు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన 1200 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటాయించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.26 కోట్లు కాగా దానిలో మెయిన్ ప్టాంటు వ్యయం రూ.20వేల కోట్లు. దాని నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. పర్యావరణ నివేదిక తయారువుతుండగానే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.

ఆ ప్రక్రియ కూడా మే నెలలో ప్రారంభించున్నారు. జూన్ నాటికి టెండర్లు, ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ నివేదిక పూర్తిచేసి పనులు మొదలుపెట్టనున్నారు. సెప్టెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 20 శాతం స్థానిక అవసరాలకు వినియోగించి, మిగిలినది ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక యువకులకు,నిపుణులకు కూడా ఉ పాధి లభిం చనుంది.

మరిన్ని వార్తలు