మరో మూడు రోజులే..

15 Dec, 2013 00:57 IST|Sakshi

=ఓటర్ల నమోదుకు గడువు
 =నేడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్వీకరణ
 =బీఎల్‌ఓల వద్ద దరఖాస్తులు
 

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ప్రజల చేతిలో పాశుపతాస్త్రం ఓటు హక్కు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండేవారంతా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకునేవారికి వచ్చే ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు కలర్ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు అందజేయనున్నారు.

కొత్త ఓటర్ల నమోదుతోపాటు, చిరునామాలో మార్పులు, నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు బదిలీ, ఓటరు గుర్తింపు కార్డులో తప్పుల సవరణకు నిర్ణీత దరఖాస్తు నింపి, అవసరమైన పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. జీవీఎంసీ పరిధిలోని 72 వార్డు కార్యాలయాల్లో ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంచారు. ఓటరు గుర్తింపు కార్డు ఉండి, జాబితాలో పేరు గల్లంతయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు గుర్తించిన డూప్లికేట్ కార్డులను తొలగిస్తామని అధికారులు తెలిపారు.
 
నేడు ప్రత్యేక డ్రైవ్

ఓటర్ల నమోదు, తప్పుల సవరణకు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 16న తుది జాబితా ప్రకటిస్తారు. ఈ జాబితా ఆధారంగానే 2014 సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆదివారం (15న) అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల నమోదు జరుగుతుంది. ఇంటర్నెట్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నవారు ప్రింటవుట్‌పై సంతకాలు చేసి, అవసరమైన పత్రాలు, ఫొటో జతచేసి దరఖాస్తులు అందజేయాలి.
 
దేనికి ఏ దరఖాస్తు

కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఫారం-6, జాబితా నుంచి పేరు తొలగించాలనుకుంటే ఫారం-7, జాబితాలో తప్పుల సవరణకు ఫారం-8, అదే నియోజకవర్గం పరిధిలో నివాసం మారినపుడు ఫారం-8ఏ అందజేయాల్సి ఉంటుంది. వివరాలకు 1950 నంబర్‌కు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలలోపు సంప్రదించవచ్చు.
 
నియోజకవర్గం మారితే..

అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మారితే సంబంధిత సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓటర్ గుర్తింపు కార్డు అందజేసి, ఓటు రద్దు చేసుకోవాలి. తరువాత మారిన నియోజకవర్గంలో కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో ఫొటో, నివాస ధృవీకరణపత్రం, వయసు ధృవీకరణపత్రం జతచేయాలి. ఇంటింటి సర్వేలో భాగంగా అద్దె ఇంట్లో ఉన్న వారు ఇల్లు మారితే వారి పేర్లను ఓటర్ల జాబితాలోంచి బీఎల్‌ఓలు తొలగించా రు. వీరు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సిందే.
 

మరిన్ని వార్తలు